రంగారెడ్డి మెడికల్ ​కాలేజీకి తాళాలు.. ఇబ్బందులు పడ్డ విద్యార్థులు, అధ్యాపకులు

రంగారెడ్డి మెడికల్ ​కాలేజీకి తాళాలు.. ఇబ్బందులు పడ్డ విద్యార్థులు, అధ్యాపకులు

ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోని తరగతి గదులకు మంగళవారం తాళం వేసి ఉండడంతో విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బందులు పడ్డారు. గత ప్రభుత్వంలో జిల్లాకు గవర్నమెంట్​మెడికల్​కాలేజీ మంజూరు కాగా, సొంత భవనం లేకపోవడంతో ఇబ్రహీంపట్నం మండలం మంగల్ పల్లిలోని భారత్ ఇన్‌‌‌‌స్టిట్యూట్స్​కాలేజీలో తాత్కాలికంగా అద్దె ప్రాతిపాదికన కొనసాగుతోంది. 

మంగళవారం ఉదయం హఠాత్తుగా భారత్​కాలేజీ యాజమాన్యం..  మెడికల్ కాలేజీ బిల్డింగ్​లోని తరగతులకు తాళం వేసింది. మెడికల్​ కళాశాల బోర్డులను కూడా తొలగించారు. దీంతో ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి అక్కడికి చేరుకొని సదరు కాలేజీ యాజమాన్యంతో చర్చించి, తాళాలు తీయించారు. 

అసలు తాళాలు ఎందుకు వేశారని మెడికల్​కాలేజీ అధ్యాపక బృందాన్ని, అధికారులు, భారత్​కాలేజీ యాజమాన్యాన్ని  వివరణ కోరగా, స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. తనిఖీలు ఉన్నందునే తాళలు వేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే, అద్దె బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో తాళాలు వేసినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.