
- సిటీలో సగానికి పడిపోయిన బిజినెస్
- ఇప్పటికీ 40 శాతం దాటని ఆక్యుపెన్సీ
- హోటల్స్ లో కూడా అంతంత మాత్రమే
- నిర్వాహకులకు భారంగా మారిన మెయింటెనెన్స్
హైదరాబాద్, వెలుగు: కరోనా, లాక్డౌన్ ఎఫెక్ట్ తో సిటీలో లాడ్జిలు ఇంకా కోలుకుంటలే. నార్మల్ పరిస్థితి వచ్చినప్పటికీ వీటి బిజినెస్ మాత్రం డల్ గానే ఉంది. ఇప్పటికీ టూరిస్ట్ లు, బిజినెస్ పనుల మీద వచ్చే వ్యాపారులు, సిటీలో పనుల కోసం వచ్చే వారి సంఖ్య పెద్దగా పెరగడం లేదు. దీంతో లాడ్జిలు నష్టాల్లోకి పోయాయి. 3 నెలలుగా బిజినెస్ పుంజుకుంటుందని ఆశతో ఉన్నప్పటికీ ఫలితం లేదు. లాక్ డౌన్ కు ముందు 90 శాతం ఆక్యుపెన్సీ ఉండేది, అన్ లాక్ మొదలైనా ఇప్పటికీ 40 శాతానికి కూడా చేరలేదని లాడ్జిల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిటీలో 3, 200 లకు పైగా లాడ్జిలు ఉండగా, వీటి ద్వారా దాదాపు లక్ష మంది ఉపాధి పొందేవారు. గిరాకీ లేక దాదాపు సగం మంది పనులు కోల్పోయారు. ఇప్పడిప్పుడే మిగతా బిజినెస్ లు రన్ వుతున్నప్పటికీ లాడ్జిల పరిస్థితి మెరుగుపడలేదు. కనీసం మెయింటెనెన్స్ ఖర్చులు కూడా రాని పరిస్థితి. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి సిటీకి వచ్చేవారికి టెంపరరీ షెల్టర్ ఇచ్చేవి లాడ్జిలే. వీటిలో ధర కూడా తక్కువ ఉండడంతో చాలామంది ఇక్కడే ఉంటుంటారు. ముఖ్యంగా సికింద్రాబాద్ జంక్షన్, ఐటీ కారిడార్, నాంపల్లి, కోఠి, ఎంజీబీఎస్, జేబీఎస్, కాచిగూడ లాంటి మెయిన్ సెంటర్లలో ఎక్కువ మంది బయట రాష్ట్రాల నుంచి వచ్చే వారు దిగుతుంటారు. వీరికోసం ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున లాడ్జిలు ఉన్నాయి. కరోనా మొదలైన నాటి నుంచి లాడ్జిల్లో చాలా రూమ్ లను కనీసం తెరవ లేదు.
చెకిన్స్ పెరగట్లే
శని, ఆదివారాల్లో లాడ్జి బుకింగ్స్ ఎక్కువగా ఉండేవి. రైళ్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్ పరిసరాల్లో గిరాకీయే లేదు. వీకెండ్ టూర్లు, ఇతర కారణాలతో వచ్చేవారు కూడా కరోనా ఎఫెక్ట్ తో భయపడుతున్నారు. అర్జెంట్ పని ఉంటే సిటీకి వచ్చి ఒక్క రోజులోనే వెళ్లిపోతున్నారు. గతేడాదిలో జీహెచ్ఎంసీ ఎన్నికల టైమ్ తప్ప బిజినెసే లేదని ఎల్బీనగర్లోని ప్రముఖ లాడ్జి నిర్వాహకుడు రవీందర్ తెలిపాడు. సిటీలో ఆన్ లైన్ ద్వారా బుక్ అయ్యే చెకిన్స్ ద్వారా లాడ్జిలకు కొన్ని ఏళ్లుగా ఎక్కువ డిమాండ్ వచ్చింది. కానీ కరోనా మళ్లీ మొత్తం బిజినెస్ ను ఆగం చేసింది.
ప్రభుత్వ సహకారమే లేదు
గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న లాడ్జిలకు కరెంట్ బిల్లు, కమర్షియల్, ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ ఫీజులను తక్కువ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని లాడ్జిల నిర్వాహకులు చెబుతున్నారు. మరో 6 నెలలు ఇలాంటి పరిస్థితే ఉంటే ఇబ్బందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లీజు తీసుకున్న వాళ్లైతే లాడ్జిలు నడపలేక మెయింటెనెన్స్ భరించలేక తీవ్రంగా నష్టపోతున్నారు. స్టాఫ్ ను చాలా వరకు తగ్గించినప్పటికీ ఉన్నవారికి జీతాలు ఇవ్వలేకపోతున్నామని నాంపల్లి లోని లాడ్జి ఆపరేటర్ మహ్మద్ గౌస్ చెప్తున్నాడు. . గిరాకీ లేకపోయినా కరెంట్ బిల్లు, మెయింటెనెన్స్, క్లీనింగ్ పనులు చేయించడంతో భారీగా భారం పడుతుందన్నాడు. ట్రేడ్ లైసెన్స్, కమర్షియల్ ట్యాక్సులను రద్దు చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.
హోటళ్లలోనూ సేమ్ సిచ్యువేషన్..
హోటల్స్ లో ఇదే పరిస్థితి ఉంది. కరోనా తర్వాత బయట తినటానికి చాలా మంది ధైర్యం చేస్తలేరు. కొంత గిరాకీ వస్తున్నప్పటికీ ఇది కూడా ఆన్ లైన్ ద్వారానే ఉంటోంది. కరోనా తర్వాత ఆన్ లైన్ లో వచ్చే బుకింగ్స్ లో తమకు పెద్దగా లాభం ఉండడం లేదని హోటల్ మేనేజ్ మెంట్లు చెబుతున్నాయి. హోటల్స్ లో ఉండేందుకు కూడా వచ్చే వారు లేరంటున్నారు. లాడ్జిలతో పోలిస్తే మాత్రం హోటల్స్ పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది.
అగ్రిమెంట్ బ్రేక్ చేసుకోలేని పరిస్థితి
కరోనా ఎఫెక్ట్తో లాడ్జింగ్ బిజినెస్ భారీగా పడిపోయింది. అ న్ లాక్ తర్వాత గిరాకీ పుంజుకుంటుందని భావించినా పెద్దగా మార్పులేదు. మరో 6 నెలలు ఇదే కొనసాగితే లాడ్జిలను మూసేయాల్సిందే. ఆన్ లైన్ సంస్థల వల్ల చాలా మంది లాడ్జి నిర్వాహకులు నష్టపోతున్నారు. కానీ వచ్చే ఆ కొద్ది గిరాకీని ఎందుకు వదులుకోవాలని చూస్తున్నాం. అగ్రిమెంట్లు బ్రేక్ చేసుకునే పరిస్థితి లేదు.
– అశోక్ రెడ్డి, హైదరాబాద్ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్
స్టాఫ్ ను తగ్గించినప్పటికీ భారమే
నాంపల్లి రైల్వే స్టేషన్ కు వచ్చిపోయే ప్రయాణికులే ఎక్కువగా లాడ్జికి వస్తుండే. ఇంకా పూర్తిస్థాయిలో రైళ్లు రావట్లేదు. దీంతో గిరాకీ కూడా అ ంతంత మాత్రమే ఉంది. కరోనా కారణంగా పనిచేసే స్టాఫ్ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. 15 రూమ్ల్లో రెండు మూడు రూంలకే బుకింగ్ వస్తోంది. స్టాఫ్ భారం తగ్గినా మెయింటెన్స్ భారం పడుతూనే ఉంది.
– నాగరాజు, లాడ్జి మేనేజర్
For More News..