General elections 2024: థియేటర్స్లో ఎన్నికల ఫలితాల ప్రదర్శన.. టికెట్ కేవలం రూ.99 మాత్రమే

General elections 2024: థియేటర్స్లో ఎన్నికల ఫలితాల ప్రదర్శన.. టికెట్ కేవలం రూ.99 మాత్రమే

దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. శనివారంతో(జూన్ 1) ఆఖరి విడత పోలింగ్‌ కూడా ముగియనుంది. దాంతో జూన్ 4న ఓట్ల లెక్కింపుపై అందరి దృష్టి ఉంది. మునుపెన్నడూ లేనంత విదంగా ఈ ఫలితాల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆరోజు యావత్‌ దేశం మొత్తం టీవీలు, ఫోన్లకు అతుక్కుపోనున్నారు.

అయితే.. ఈ ఎన్నికల క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు థియేటర్స్ యజమానులు. ఎన్నికల ఫలితాలను లైవ్‌లో బిగ్‌ స్క్రీన్‌పై ప్రసారం చేయబోతున్నాయి. ముంబైలోని ఎస్ఎం 5 కళ్యాణ్, సియాన్, కంజూర్‌మార్గ్‌లోని మూవీమ్యాక్స్‌, థానేలోని వండర్ మాల్, ఎటర్నిటీ మాల్, నాగ్‌పుర్‌లోని మూవీమ్యాక్స్‌ ఎటర్నిటీ, పుణెలోని మూవీమ్యాక్స్‌, మీరా రోడ్లోని మూవీమాక్స్ చైన్ ఆఫ్ థియేటర్లు ఎన్నికల ఫలితాలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.

ఇందుకోసం ఇప్పటికే ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాలు కూడా మొదలుపెట్టేశాయి. టికెట్‌ ధరలు కూడా రూ. 99 నుంచి రూ. 300 వరకు ఉండనుందని సమాచారం. ఇక ఉదయం 9గంటల నుంచే జనాలను థియేటర్‌లలోకి అనుమతిస్తారు. ఇక బిగ్‌ స్క్రీన్‌పై ఎన్నికల ఫలితాలు చూడాలనుకునే వారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉండటంతో చాలా చోట్ల హౌస్‌ఫుల్‌ అయిపోయినట్టు సమాచారం.