బెల్లంపల్లి మార్కెట్ లో​ స్టాల్స్ కోసం లాటరీ...108 మందికి కేటాయింపు

బెల్లంపల్లి మార్కెట్ లో​ స్టాల్స్ కోసం లాటరీ...108 మందికి కేటాయింపు

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలో ప్రారంభించిన మార్కెట్ భవనంలో స్టాళ్లు కేటాయించేందుకు లాటరీ నిర్వహించారు. ఆదివారం బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 108 లబ్ధిదారులకు లాటరీ ద్వారా స్టాల్స్ కేటాయించారు.  లబ్ధిదారుల పేర్లను చైర్ పర్సన్ జక్కుల శ్వేత, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు వెల్లడించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సోమవారం నుంచి వ్యాపారులంతా మార్కెట్​లోనే కూరగాయలు అమ్మాలని, పట్టణంలో మరెక్కడైనా అమ్మితే రూ.1000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. స్టాల్స్ రానివారు నిరాశ పడవద్దన్నారు. మార్కెట్ భవనంలోని కింది భాగంలో కూరగాయలు అమ్మేందుకు అవకాశం ఉందని, రూ.5వేలు మున్సిపల్ కార్యాలయంలో డిపాజిట్ చేసి, నెలసరి అద్దె రూ.1000 చెల్లించాలని తెలిపారు. పూర్తి వివరాలకు మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.