ప్రేమించొద్దన్నందుకు.. కూతురు ముందే తండ్రిని నరికి చంపాడు

ప్రేమించొద్దన్నందుకు.. కూతురు ముందే తండ్రిని నరికి చంపాడు

ఆంధ్రప్రదేశ్ లో ఓ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. నడిరోడ్డుపై కత్తితో నరికి నరికి హత్య చేశాడు ఓ యువకుడు. విజయవాడ బృందావన్‌ కాలనీలో 2024, జూన్ 27వ తేదీ గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  భవానీపురంలోని చెరువు సెంటర్‌కు చెందిన కె శ్రీరామచంద్రప్రసాద్‌ (56) బృందావన్‌ కాలనీలో కిరాణా షాపు నిర్వహిస్తున్నారు. నిత్యం భవానీపురం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఆయన కుమార్తె దర్శిని ఇంజనీరింగ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. విద్యాధరపురానికి చెందిన గడ్డం శివమణికంఠ విజ్ఞాన్‌ విహార్‌ స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. 

మణికంఠకు ఇన్‌స్టాలో దర్శినితో పరిచయం ఏర్పడింది. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన శ్రీరామచంద్రప్రసాద్‌ కుమార్తెను హెచ్చరించాడు. బాగా చదువుకుని జీవితంలో స్థిరపడాలన్నారు. తన కుమార్తె జోలికి రావద్దని మణికంఠను హెచ్చరించారు. దీంతో కొద్దిరోజులుగా దర్శిని అతడిని పక్కనపెట్టింది. పెళ్లి చేసుకోవాలని మణికంఠ చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది. దీనిపై శ్రీరామచంద్రప్రసాద్‌ కొంతమందిని తీసుకుని మణికంఠ ఇంట్లో పంచాయితీ పెట్టారు. 

ఆ తర్వాత మణికంఠ ఇంట్లో రోజూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మణికంఠ తల్లి గురువారం ఇల్లు విడిచి వెళ్లిపోయింది. దీంతో మణికంఠ పగ పెంచుకున్నాడు. గురువారం శ్రీరామచంద్రప్రసాద్‌ కుమార్తెను తీసుకుని బృందావన్‌ కాలనీలోని కిరాణా షాపుకు వచ్చాడు. రాత్రి 9 గంటల సమయంలో షాపు మూసేసి ఇద్దరూ ఇంటికి బయల్దేరారు. పగతో రగిలిపోతున్న మణికంఠ కత్తి తీసుకుని బృందావన్‌ కాలనీకి వచ్చాడు. షాపుకు 100 మీటర్ల దూరంలో ఉన్న ఓ చెట్టు కింద నిలబడ్డాడు. తండ్రీకూతుళ్లు స్కూటర్‌పై వస్తుండగా, ఎదురుగా వెళ్లి బైకుతో ఢీ కొట్టాడు. కిందపడిపోయిన శ్రీరామచంద్రప్రసాద్‌పై కత్తితో విచక్షణరహితంగా దాడి చేశాడు. 

దీంతో తీవ్రంగా గాయపడి రోడ్డుపై పడిన తండ్రిని కూతరు పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టగానే మళ్లీ దాడి చేసి పలుమార్లు నరికాడు. దర్శిని ఎంత ఆపినా విచక్షణ లేకుండా నరికాడు.  తనతో తిరిగిన వీడియోలు సోషల్‌ మీడియాలో పెడతానని ఆమెను బెదిరించాడు. దర్శిని అరుపులు విని చుట్టుపక్కలవారు రాగానే అక్కడి నుంచి మణికంఠ పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన శ్రీరామచంద్రప్రసాద్‌ను వెంటనే ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని ప్రభుత్వాసు పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కృష్ణలంక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.