ఉమ్మడి వరంగల్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. దీంతో ఉమ్మడి వరంగల్ లో చలి తీవ్రత పెరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో భారీగా మంచు కురిస్తోంది. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు.భారీగా కురిసిన మంచుతో చలిగాలుల తీవ్రత పెరగడంతో పలు ప్రాంతాల్లో జనాలు చలిమంటలు కాచుకుంటున్నారు.
ఇక, మన్యంపై మంచు దుప్పటి కమ్ముకుంది. పట్టణంతో పాటు పలు మార్గాలను మంచు కమ్మేసింది. ఉదయం 9 గంటల వరకూ మంచు ముసుగు తొలగకపోవడంతో ప్రధాన మార్గంలో వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణం చేయాల్సి వస్తోంది. వరంగల్ తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. 10 డిగ్రీల సెల్సీయస్ కంటే దిగువకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఈ క్రమంలో రాత్రి వేళ్లలో కూడా చలి తీవ్ర పెరిగింది. దీంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు.