
- కొందరి వివరాలు కనిపించట్లే
- సరిచేసుకుందామంటే సర్వర్ బిజీ
- ఈ నెల 31తో ముగియనున్న 25 శాతం రాయితీ గడువు
- నిజామాబాద్జిల్లాలో దరఖాస్తుదారుల ఎదురుచూపులు
నిజామాబాద్, వెలుగు: ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించి, స్థలాలను రెగ్యులరైజేషన్చేసుకునేందుకు చేపట్టిన స్పెషల్డ్రైవ్ నత్తనకడన సాగుతోంది. జిల్లాలో 35 వేల ప్లాట్లను రెగ్యులరైజ్చేసుకునేందుకు దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. మరో వారం రోజుల్లో ఎల్ఆర్ఎస్ గడువు ముగియనుండటంతో ఆలోగా క్రమబద్ధీకరణ పూర్తవుతుందా లేదా అన్నది అనుమానంగా మారింది.
యాక్టివ్గా లేని హెల్ప్డెస్క్ లు..
25 శాతం రాయితీతో ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించేందుకు ప్రభుత్వం ఈ నెల 31 వరకు గడువు విధించింది. రుసుము చెల్లించాలనుకుంటున్నవారికి టెక్నికల్ సమస్యలు ఎదురవుతున్నాయి. అప్లికేషన్ చేసినప్పటి వివరాలకు ఆన్లైన్లో జనరేట్అయిన వివరాలకు పొంతన ఉండటం లేదు. సరిచేసుకుందామంటే సర్వర్ బిజీ అని వస్తోంది. ఎల్ఆర్ఎస్ కోసం మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్లు యాక్టివ్గా లేకపోవడం కూడా శాపంగా మారింది. 2020కి ముందు అప్లికేషన్ పెట్టుకున్న వారి వివరాలేవీ ఆన్లైన్ లో కనిపించకపోవడంతో గందరగోళం నెలకొంది.
200 గజాలుంటే150 గజాలుగా..
అర్బన్ ఏరియాలో ప్లాట్ల రెగ్యులైజేషన్కు గత ప్రభుత్వం నిజామాబాద్జిల్లా నుంచి 35 వేల దరఖాస్తులు తీసుకుంది. రూ.1,000 రిజిస్ట్రేషన్ ఫీజుతో 31 అక్టోబర్2020 నాటికి గడువు విధించింది. ఆ తర్వాత ఎల్ఆర్ఎస్ ను గ్రామ పంచాయతీలకు వర్తింపజేయడంతో 530 జీపీల పరిధిలో 19 వేల మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. అంతకుముందు 2019లో రూ.10 వేల ఫీజుతో సుమారు 1,500 అప్లికేషన్లు తీసుకున్నారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక దరఖాస్తుదారుల సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధమైంది.
వారిపై ఆర్థిక భారం పడకూడదని భావించి, 25 శాతం రాయితీ ప్రకటించింది. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితి మరో రకంగా ఉండటం సమస్యగా మారింది. చదువుకున్న వ్యక్తులు ఆన్లైన్లో ఫీజు చెల్లించడానికి సిద్ధపడగా వివరాలు తప్పుగా కనిపిస్తున్నాయి. రిజిస్ర్టేషన్డాక్యుమెంట్లో 200 గజాలున్న ప్లాట్150 గజాలుగా, రిజిస్ట్రేషన్ టైంలో ఉన్న ఫీజు ఎక్కువగా చూపిస్తున్నాయి. కొందరి వివరాలేవీ కనిపించడం లేదు. సరిచేసుకోడానికి మున్సిపల్ ఆఫీస్లకు పరుగులు తీస్తుండగా అక్కడ ఆశించిన సహాయం అందడం లేదు. సర్వర్ బిజీ అంటూ టౌన్ప్లానింగ్స్టాఫ్ చేతులెత్తేస్తున్నారు.
ప్రోసీడింగ్స్ వెంటనే ఇవ్వట్లే..
మీసేవ సెంటర్లను ఆశ్రయిస్తే 5 ఎంబీ సైజ్కు మించకుండా పీడీఎఫ్ ఫైల్గా అప్లోడ్ చేయాల్సి ఉండగా, డాక్యుమెంట్పై అవగాహన లేకపోవడంతో శ్రమ వృథా అవుతోంది. పేమెంట్చేసిన వారికి ప్రొసీడింగ్స్వెంటనే ఇవ్వకుండా తర్వాత ఇస్తామని చెప్పడంతో దరఖాస్తుదారులు వెనుదిరుగుతున్నారు. ఈ పరిణామాలన్నీ ఎల్ఆర్ఎస్ను అనుకున్నంత స్పీడ్గా ముందుకు తీసుకెళ్లడం లేదు. బాల్కొండ మున్సిపాలిటీలో మొత్తం 1,453 మంది దరఖాస్తుదారులకు గానూ ఇప్పటివరకు 68 మంది మాత్రమే ప్లాట్లను రెగ్యులైజ్ చేసుకున్నారు.
ఆర్మూర్ టౌన్ లో 4,125 మందికి 344, బోధన్ టౌన్లో 13,855 మందికి 104, నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో 16 వేలకు పైగా అర్జీదారులు ఉంటే కేవలం 920 మంది ప్లాట్లు క్రమబద్ధీకరణ జరిగి, ప్రభుత్వ ఖాతాకు రూ.13 కోట్ల ఆదాయం చేరింది. రాయితీ గుడువు సమీపిస్తుండగా టార్గెట్చేరడం ఆఫీసర్లకు కష్టంగా మారింది.
కొందరు ప్లాట్లు అమ్మేశారు..
ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న వారిలో కొంతమంది తమ ప్లాట్లను వేరే వారికి అమ్మేశారు. ఆ వివరాలు ఇప్పుడు మున్సిపాలిటీలో లేవు. రెగ్యులైజేషన్కోసం రమ్మని దరఖాస్తుదారులకు ఫోన్చేస్తే వారు తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. గ్రామ పంచాయతీల పరిధిలో ప్లాట్ల రెగ్యులైజేషన్ మరీ నెమ్మదిగా ఉంది. 2019 నాటి దరఖాస్తుల ఊసే ఆన్లైన్లో లేదు. అసలు తమ అర్జీలు ఉన్నట్లా? లేనట్లా? అర్థంకాక సుమారు 1,500 మంది ఆయోమయంలో పడ్డారు.