
- రాణించిన పూరన్, మార్క్రమ్
- గిల్, సుదర్శన్ శ్రమ వృధా
లక్నో: పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్తో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్కు లక్నో సూపర్జెయింట్స్ ఝలక్ ఇచ్చింది. ఛేజింగ్లో నికోలస్ పూరన్ (34 బాల్స్లో 1 ఫోర్, 7 సిక్స్లతో 61), మార్క్రమ్ (31 బాల్స్లో 9 ఫోర్లు, 1 సిక్స్తో 58) చెలరేగడంతో.. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో లక్నో 6 వికెట్ల తేడాతో గుజరాత్పై గెలిచి హ్యాట్రిక్ను ఖాతాలో వేసుకుంది. టాస్ ఓడిన జీటీ 20 ఓవర్లలో 180/6 స్కోరు చేసింది. శుభ్మన్ గిల్ (38 బాల్స్లో 6 ఫోర్లు, 1 సిక్స్తో 60), సాయి సుదర్శన్ (37 బాల్స్లో 7 ఫోర్లు, 1 సిక్స్తో 56) హాఫ్ సెంచరీలతో రాణించారు. తర్వాత లక్నో 19.3 ఓవర్లలో 186/4 స్కోరు చేసింది. మార్క్రమ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
కీలక భాగస్వామ్యం..
గుజరాత్కు ఓపెనర్లు గిల్, సుదర్శన్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చినా.. మిడిలార్డర్ వైఫల్యంతో భారీ స్కోరు చేయలేకపోయింది. ఫోర్తో ఖాతా తెరిచిన సుదర్శన్ ఆరో ఓవర్లో తొలి సిక్స్ కొట్టాడు. మధ్యలో గిల్ కూడా ఫోర్లు బాదడంతో పవర్ప్లేలో జీటీ 54/0 స్కోరు చేసింది. ఏడో ఓవర్లో చెరో ఫోర్తో 12 రన్స్ చేయగా, 8వ ఓవర్లో గిల్ 4, 6తో 15 రన్స్ దంచాడు. 10వ ఓవర్లో సుదర్శన్ ఫోర్ కొట్టి 15 రన్స్ రాబట్టడంతో స్కోరు 103/0కి చేరింది. ఈ క్రమంలో గిల్ 31 బాల్స్లో హాఫ్ సెంచరీ చేశాడు.
11వ ఓవర్లో సుదర్శన్ ఇచ్చిన క్యాచ్ను పాయింట్లో సమద్ వదిలేయడంతో 32 బాల్స్లో ఫిఫ్టీ పూర్తయింది. కానీ 12వ ఓవర్లో అవేశ్ ఖాన్ (1/32).. గిల్ను ఔట్ చేయడంతో తొలి వికెట్కు 120 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. ఇక్కడి నుంచి లక్నో బౌలర్లు పుంజుకున్నారు. 14వ ఓవర్లో బిష్ణోయ్... సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ (2)ను ఔట్ చేసి డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. మధ్యలో బట్లర్ (16) ఫెయిలయ్యాడు. 22 బాల్స్ తేడాతో మూడు కీలక వికెట్లు పడటంతో జీటీ 145/4తో నిలిచింది.
రూథర్ఫోర్డ్ (22), షారూక్ ఖాన్ (11 నాటౌట్) ఐదో వికెట్కు 17 బాల్స్లోనే 31 రన్స్ జోడించారు. కానీ ఆఖరి ఓవర్లో వరుస బాల్స్లో రూథర్ఫోర్డ్, రాహుల్ తెవాటియా (0) ఔటయ్యారు. చివరి 8 ఓవర్లలో 60 రన్సే వచ్చాయి. శార్దూల్, రవి బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు తీశారు.
మార్క్రమ్, పూరన్ జోరు..
లక్నో ఛేజింగ్లో మార్క్రమ్, పూరన్ చెలరేగినా జీటీ బౌలర్లు మ్యాచ్ను చివరి ఓవర్ వరకు తీసుకెళ్లారు. ఓపెనర్గా వచ్చిన రిషబ్ పంత్ (21) ధనాధన్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. రెండుసార్లు క్యాచ్ ఔట్ నుంచి బయటపడిన మార్క్రమ్ బౌండ్రీల మోత మోగించాడు. దీంతో పవర్ప్లేలో లక్నో 61/0 స్కోరు చేసింది. ఏడో ఓవర్లో తొలి బాల్ను ఫోర్గా మలిచిన పంత్ తర్వాతి బాల్కు వెనుదిరగడంతో తొలి వికెట్కు 65 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది.
ఈ దశలో వచ్చిన పూరన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సిక్స్తో ఖాతా తెరిచిన అతను 8వ ఓవర్లో ఇచ్చిన క్యాచ్ను రషీద్ డ్రాప్ చేశాడు. 9వ ఓవర్లో మార్క్రమ్ 4, పూరన్ 6తో 12 రన్స్ వచ్చాయి. కిశోర్ వేసిన 10వ ఓవర్లో పూరన్ 6, 6, 6 దంచితే మార్క్రమ్ ఫోర్తో 26 బాల్స్లో ఫిఫ్టీ పూర్తి చేశాడు.
ఫస్ట్ టెన్లో లక్నో 114/1తో నిలిచింది. 12వ ఓవర్లో మార్క్రమ్ ఔట్ కావడంతో రెండో వికెట్కు 58 రన్స్ జతయ్యాయి. 13వ ఓవర్లో పూరన్ 6, 4తో 23 బాల్స్లో హాఫ్ సెంచరీ సాధించాడు. కొద్దిసేపటికే మరో సిక్స్ కొట్టి 16వ ఓవర్లో రషీద్ (1/35)కు వికెట్ ఇచ్చాడు. ఆయూష్ బదోనీ (28 నాటౌట్)తో కలిసిన డేవిడ్ మిల్లర్ (7) మెల్లగా ఆడటంతో విజయసమీకరణం 18 బాల్స్లో 18గా మారింది. ఈ టైమ్లో మిల్లర్ ఔటైనా.. సమద్ (2 నాటౌట్)తో కలిసి బదోనీ 4, 6 కొట్టి గెలిపించాడు.
5 ఐపీఎల్లో వేగంగా 2 వేల రన్స్ చేసిన ఐదో బ్యాటర్ గిల్ (51 ఇన్నింగ్స్). గేల్ (41), రాహుల్ (43), వార్నర్ (47), బట్లర్ (49) ముందున్నారు.
సంక్షిప్త స్కోర్లు :
గుజరాత్: 20 ఓవర్లలో 180/6 (గిల్ 60, సుదర్శన్ 56, శార్దూల్ 2/34, రవి బిష్ణోయ్ 2/36). లక్నో: 19.3 ఓవర్లలో 186/4 (పూరన్ 61, మార్క్రమ్ 58, ప్రసిధ్ కృష్ణ 2/26).