తాండూర్​ మండలంలో నీటి సమస్య తీర్చాలని మహిళల నిరసన

తాండూర్​ మండలంలో నీటి సమస్య తీర్చాలని మహిళల నిరసన

తాండూరు, వెలుగు: ఫిల్టర్ ​బెడ్ల నిర్వహణలో సింగరేణి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పంపులు, మోటార్లు చెడిపోయి రోజుల తరబడి నీటి సరఫరాకు అంతరాయం కలడంతో తాండూర్​ మండలంలోని మాదారం టౌన్​షిప్​వాసులు నీటి కోసం తిప్పలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నీటి సమస్య తీర్చాలని బుధవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఖాళీ బిందెలతో గోలేటి,  ఖైరిగూడ  ప్రధాన రహదారిపై బైఠాయించారు. నీటి సమస్యపై సింగరేణి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పరిష్కరించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ఐఎన్​టీయూసీ, ఏఐటీయూసీ నాయకులు మద్దతు పలికారు. 

వన్​ ఇంక్లయిన్​ నుంచి ఫిల్టర్​ బెడ్​కు నీటిని సరఫరా చేసే పంపుల రిపేర్లు చేపట్టి సమస్య తీర్చాలని డిమాండ్​ చేశారు. ఆందోళన నేపథ్యంలో బెల్లంపల్లి ఏరియా సివిల్​డీజీఎం భాషా మాదారం ఫిల్టర్​ బెడ్​ను సందర్శించారు. నీటిఎద్దడిని తీర్చడానికి చర్యలు తీసుకుంటామని హమీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. నిరసనలో ఐఎన్​టీయూసీ ఏరియా ఉపాధ్యక్షుడు పేరం శ్రీనివాస్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ప్రకాశ్​రావు, కార్యదర్శి రామారావు, ఏరియా కార్యదర్శి చంద్రకుమార్, నాయకులు రఘునాథ్​రెడ్డి, బాపురెడ్డి, ఏఐటీయూసీ నాయకులు బి.మొగిలి, పి.శంకర్ తదితరులు ​పాల్లొన్నారు.