
- హరహర మహదేవా
వెలుగు, నెట్ వర్క్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మహా శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు శివనామస్మరణలో తరించారు. ఉదయం నుంచే ఆయా ఆలయాల వద్ద బారులు తీరారు. నల్లమల్ల అటవీ ప్రాంతంలోని బౌరాపూర్ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కల్యాణోత్సవాన్ని చెంచులు అత్యంత వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ, ఐటీడీఏ ఆధ్వర్యంలో అధికారికంగా వేడుకలు నిర్వహించారు. చెంచులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు ఎదుర్కోళ్లు నిర్వహించారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపులు, ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆదివాసీ ఉత్పత్తులు, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పిండి వంటకాల వివిధ స్టాల్స్ ఏర్పాటు చేశారు.
పెళ్లి పెద్దలుగా అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ దంపతులు హాజరై కల్యాణాన్ని వైభవంగా జరిపించారు. జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో బుధవారం మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. మహా శివరాత్రి పురస్కరించుకొని భక్తులు వేలాదిగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణాలు భక్తులతో కిటకిటలాడాయి. 200 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. క్యాతూర్ పీహెచ్సీ ఆధ్వర్యంలో హెల్త్ సెంటర్ని ఏర్పాటు చేశారు. బుధవారం జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కోడేరు మండల పరిధిలోని రాజాపురం గ్రామంలో రాజరాజేశ్వరి ఆలయంలో శివనామ స్మరణలతో మారుమోగింది.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఏటా చుట్టుపక్కల గ్రామస్తులు శానాయిపల్లి గ్రామ పరిధిలోని గుడిపల్లి గుట్టపై వెలసిన మల్లికార్జున భ్రమరాంబ దంపతుల కల్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం సోమశిలకు భక్తుల రద్దీ పెరిగింది. సోమశిల పుణ్యక్షేత్రంలో మహా శివరాత్రి సందర్భంగా శ్రీ లలితా సోమేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి కృష్ణ నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలునిర్వహించారు.