
- సానుకూలంగా స్పందించిన మంత్రి
- అప్పన్నపల్లి, నవాబ్పేట, హన్వాడ మండలాల మీదుగా బై పాస్కు ప్రపోజల్స్
మహబూబ్నగర్, వెలుగు: నేషనల్ హైవే 167 (మహబూబ్నగర్,-చించోలి), నేషనల్ హైవే 167 ఎన్(మహబూబ్నగర్,-రాయచూర్ సెక్షన్)తో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పాలమూరు పట్టణం లోపలి నుంచే ఈ హైవే వెళ్లడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ సహకారంతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఈ రెండు జాతీయ రహదారులకు అనుబంధంగా నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద బై పాస్ రోడ్డు మంజూరు చేయాలని కోరగా, ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.
యాక్సిడెంట్లు.. ట్రాఫిక్ తిప్పలు..
ఎన్హెచ్ 167 కర్నాటకలోని హగరి నుంచి మొదలవుతుంది. ఏపీలోని ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం మీదుగా మళ్లీ కర్నాటకలోని రాయచూరు నుంచి తెలంగాణలోని మక్తల్, మహబూబ్నగర్, జడ్చర్ల, కల్వకుర్తి, దేవరకొండ, నిడమనూరు, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ వరకు 483 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఇందులో కర్నాటకలో 55 కిలోమీటర్లు, ఏపీలో 99.15 కిలోమీటర్లు, తెలంగాణలో అత్యధికంగా 321.88 కిలోమీటర్ల పొడవునా ఈ హైవే ఉంది.
ఎన్హెచ్-167(ఎన్) భూత్పూరు నుంచి మహబూబ్నగర్ వయా హన్వాడ, గండీడ్, కోస్గి మీదుగా చించోలి వరకు 107 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఈ హైవే కింద రోడ్డు విస్తరణ పనులు ఇంకా జరుగుతున్నాయి. అయితే మహబూబ్నగర్ పట్టణం మీదుగా ఈ రెండు హైవేలు ఉండడంతో ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. ఉదయం, సాయంత్రం మెట్టుగడ్డ, వన్టౌన్, న్యూ టౌన్, బస్టాండ్ చౌరస్తా, పద్మావతి కాలని, టీడీ గుట్ట, బోయపల్లి, పాత బస్టాండ్, అశోక్ టాకీస్, పాత పాలమూరు, భగీరథ కాలనీ, బండమీదిపల్లి తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీనికితోడు రాత్రిళ్లు భారీ వాహనాలు వెళ్తుండటం, పట్టణంలో ఆ వాహనాలను నిలుపుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
కొద్ది రోజుల కిందట న్యూ టౌన్ ఏరియాలో తెల్లవారుజామున హైవే-167పై ఆగి ఉన్న డీఎంసీను బైక్ ఢీ కొట్టడంతో మెడిసిన్ చదువుకుంటున్న ఇద్దరు స్టూడెంట్లు స్పాట్లోనే చనిపోయారు. ఇటీవల రూరల్ మండలం మన్యంకొండ వద్ద తెల్లవారుజామున బైక్ పై వెళ్తున్న అన్నదమ్ములను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో అన్న స్పాట్లోనే చనిపోగా.. తమ్ముడికి కాలు విరిగింది. ట్రాఫిక్ సమస్యతో పాటు యాక్సిడెంట్లు పెరుగుతుండడంతో ఈ హైవేపై బై పాస్ ఏర్పాటు చేయాలనే డిమాండ్లు తెరమీదకు వచ్చాయి.
నామినల్ సర్వే పూర్తి..
పాలమూరులో కొత్త బై పాస్ ఏర్పాటు చేసేందుకు ఆఫీసర్లు కొద్ది రోజుల కింద నామినల్ సర్వే చేసినట్లు తెలిసింది. హైవేల నుంచి హెవీ వెహికిల్స్ పట్టణంలోకి రాకుండా.. ఓ రూట్ మ్యాప్ను తయారు చేసినట్లు సమాచారం. దాని ప్రకారం మహబూబ్నగర్ మున్సిపాల్టీలోని అప్పన్నపల్లి నుంచి కొత్త బై పాస్ రోడ్డు ఏర్పాటు చేసేలా డిజైన్ చేశారు. అక్కడి నుంచి నవాబ్పేట మండలం మీదుగా హన్వాడ మండలంలోని చిన్నదర్పల్లి వద్ద ఎన్హెచ్-167 (ఎన్)కు లింక్ కలిపేలా ప్లాన్ చేశారు.
ఇప్పటికే రెండు బై పాస్లు..
మహబూబ్నగర్లో ఇప్పటికే రెండు బై పాస్ రోడ్లు మంజూరయ్యాయి. అందులో ఒకటి మహబూబ్నగర్, -జడ్చర్ల రోడ్డు మీదుగా పిస్తా హౌస్ నుంచి మొదలై భూత్పూర్,-మహబూబ్నగర్ మెయిన్ రోడ్డుకు అనుసంధానం చేశారు. ఈ పనులు పూర్తి కాగా.. ఈ బై పాస్ అందుబాటులోకి వచ్చింది. మరో బై పాస్ భూత్పూర్, -మహబూబ్నగర్ మెయిన్ రోడ్డు క్రిస్టియన్పల్లి నుంచి ప్రారంభమై.. పాలమూరు యూనివర్సిటీ, వీరన్నపేట, చిన్నదర్పల్లికి అనుసంధానం చేస్తున్నారు. ఈ బై పాస్ పనులు ఇంకా సాగుతున్నాయి.
బై పాస్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు..
ఎన్హెచ్-167 హైవే మీద బై పాస్ కావాలని ఎమ్మెల్యే యెన్నంతో కలిసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రం ఇచ్చాం. బై పాస్ పనులు తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ బై పాస్ తో పట్టణ ప్రజల సమస్య తీరుతుంది. - డీకే అరుణ, ఎంపీ
ఎండార్స్మెంట్ చేశారు..
మహబూబ్నగర్ ప్రజలు మరో బై పాస్ను కోరుతున్నారు. పాలమూరుకు సర్క్యులర్ రింగ్ రోడ్డు వస్తే పట్టణంలోకి భారీ వాహనాలు రాకుండా.. బయటి నుంచే వెళ్లిపోతాయి. దీంతో ట్రాఫిక్ సమస్య తప్పుతుంది. అప్పన్నపల్లి నుంచి చిన్నదర్పల్లి వరకు బై పాస్ మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి వినతిపత్రం ఇవ్వగా.. ఆయన ఎండార్స్మెంట్ కూడా చేశారు. యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే