గణపతి బప్పా మోరియా..అగ్లే బరస్​ తు జల్దీ ఆ..!

గణపతి బప్పా మోరియా..అగ్లే బరస్​ తు జల్దీ ఆ..!

హైదరాబాద్ సిటీ, వెలుగు: మహానగరాన గణేశ్​నిమజ్జన జోష్ ​ఇంకా నడుస్తోంది. 11 రోజులు ‘ఘన’ పూజలు చేసిన భక్తులకు.. అప్పుడే గణపయ్యను గంగమ్మ ఒడికి సాగనంపడం ఇష్టం లేదేమో.. మంగళవారం ఆలస్యంగా నిమజ్జనాలకు బయలుదేరారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు నగరంలోని ప్రధాన రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. హుస్సేన్​సాగర్​తీరం లోని ట్యాంక్​బండ్, నెక్లెస్​రోడ్, ఎన్టీఆర్​ మార్గ్​తో పాటు సిటీలోని ఇతర ప్రధాన చెరువులు బోసిపోయి కనిపించాయి. ఎప్పుడూ రాత్రి 8 గంటలు దాటిన తర్వాతే నిమజ్జనమయ్యే  బాలాపూర్ ​గణేశుడు ఈసారి ఎక్కడా ట్రాఫిక్ ​లేకపోవడంతో నాలుగ్గంటలకే గంగమ్మ ఒడి చేరాడు.

ఉదయం వేళలో ఖైరతాబాద్​బడా గణపతి శోభాయాత్ర చూసేందుకు లక్షల్లో తరలివచ్చిన జనం మినహా హుస్సేన్​సాగర్​తీరంలో పెద్దగా జనం కనిపించలేదు. సాయంత్రం నుంచి ఒక్కొక్కటిగా వినాయక విగ్రహాలు బయలుదేరడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. పలుచోట్ల ట్రాఫిక్​జామ్స్​ఏర్పడ్డాయి. చార్మినార్​, మొజంజాహీ మార్కెట్, బషీర్​బాగ్,​ లిబర్టీ ప్రాంతాలు జనంతో కిక్కిరిశాయి. ఒక్కసారిగా రష్ ​పెరగడంతో మంగళవారం అర్ధరాత్రితో నిమజ్జనాలు పూర్తవుతాయని కాన్పిడెంట్​గా ఉన్న అధికారులు బుధవారం ఉదయంలోపు పూర్తి చేస్తామని ప్రకటించారు. ఇది మధ్యాహ్నం వరకూ కొనసాగుతుందనే అంచనాతో స్పీడ్​గా నిమజ్జనాలు కొనసాగిస్తున్నారు.