
హైదరాబాద్ సిటీ, నెట్వర్క్ : గ్రేటర్ సిటీ శివ నామస్మరణతో మార్మోగింది. మహాశివరాత్రి సందర్భంగా బుధవారం శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయాల వద్ద రోజంతా క్యూలైన్లు కనిపించాయి. శివలింగాలకు అభిషేకం, ప్రత్యేక పూజలు చేసేందుకు భక్తులు బారులుదీరారు. చాలాచోట్ల శివపార్వతుల కల్యాణం వైభవంగా జరిగింది. మేడిబావి ఆర్యసమాజ్లో నిర్వహించిన రుద్రయాగంలో 108 జంటలు పాల్గొన్నాయి.
భారీగా తరలి వచ్చిన భక్తజనంతో కీసరగుట్ట కిక్కిరిసింది. శ్రీభవానీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కిలోమీటర్ల మేర భక్తులు క్యూ కట్టారు. దర్శనానికి 5 గంటల సమయం పట్టింది. మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. ఎగ్జిట్ గేట్ గుండా అధికారుల బంధువులను దర్శనానికి పంపించడంపై సాధారణ భక్తులు మండిపడ్డారు.