
మాఘమాసం కొనసాగుతుంది. ఈ నెల పండుగల మాసం.. ఇప్పటికే దాదాపు మాఘమాసం సగం రోజులు గడిచాయి. మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్ధశి రోజు మహాశివరాత్రి పండుగను హిందువులు ఘనంగా జరుపుకుంటారు. దాదాపు అందరూ శివాలయాలను దర్శిస్తారు. ప్రత్యేకంగా శివ పరమాత్మకు అభిషేకాలు చేస్తారు. అయితే ఒక్కో ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఒక్కో రకమైన ఫలితాలుంటాయి. పండితులు.. పురాణాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో తెలుసుకుందాం. . .
మహాశివరాత్రి ...మాఘమాసం కృష్ణ పక్షం చతుర్థశి.. ఈ ఏడాది(2025) మహాశివరాత్రి ఫిబ్రవరి 26న వచ్చింది. శివరాత్రి రోజు శివాలయాలు కిటకిటలాడిపోతాయి. దాదాపు ప్రతి శివాలయంలో అభిషేకాలు నిర్వహిస్తారు. విష్ణుమూర్తి అలంకార ప్రియడైతే.. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. ఆ రోజున 2025 ఫిబ్రవరి 26న శివుడికి లింగోద్భవ సమయంలో అంటే అర్దరాత్రి 12 గంటల సమయంలో అభిషేకం చేస్తారు.
- ఆవుపాలు: సర్వ సుఖాలు కలుగుతాయని నమ్మకం. దీర్ఘాయువు ఇస్తుంది.
- ఆవు పెరుగు: ఆరోగ్యం, బలం సమకూరతాయి. సంతాన ప్రాప్తి లభిస్తుంది.
- ఆవు నెయ్యి : ఐశ్వర్యం పెరుగుతుంది
- చెరకు రసం: దుఖం తొలగిపోతుంది
- తేనె: తేజస్సు పెరుగుతుంది
- భస్మ జలం : పాపాలు తొలగిపోతాయి
- సుగంధోదకం: పుత్ర సంతోషం కలుగుతుంది
- పుష్పొదకం: స్థిరాస్తి పెరుగుతుంది
- బిల్వ జాలం: ఆనందం వెల్లివిరుస్తుంది
- నువ్వుల నూనె: మృత్యు దోషం తొలగిపోతుంది
- రుద్రాక్షోదకం: ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది
- సువర్ణ జలం : దరిద్రం తొలగిపోతుంది
- అన్నాభిషేకం: సుఖ జీవనం
- ద్రాక్ష రసం: సకల కార్యాభివృద్ధి
- కొబ్బరినీళ్లు: సర్వ సంపద వృద్ధి చెందుతుంది
- ఖర్జూర రసం: శత్రునాశనం
- దూర్వోదకం( గరిక జలం): ఆర్థికాభివృద్ధి
- గంగోదకం: సర్వ సమృద్ధి, సంపద ప్రాప్తి లభిస్తుంది
- కస్తూరీ జలం: రాజసం
- నేరేడు పండ్ల రసం: నిరాశ తొలగిపోతుంది
- నవరత్న జలం: గృహ ప్రాప్తి కలుగుతుంది
- మామిడి పండు రసం: దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయి.
- పసుపు, కుంకుమ: మంగళ ప్రదం
- విభూది : కోటి రెట్ల ఫలితం దక్కుతుంది
- పంచదార: శత్రువులు నశిస్తారు
పంచామృతాన్ని భగవంతుడికి సమర్పించడం వల్ల చెడు ఆలోచనలు తగ్గుతాయి. స్వార్థం అనే ఆలోచన రాకుండా చేస్తుంది. ఆనందం పొందుతారు. ఏదైనా వ్యాధితో బాధపడే వ్యక్తి పేరు మీద రుద్ర పధంతో శివాభిషేకం చేస్తే ఆ వ్యాధి నుంచి త్వరగా విముక్తి పొందుతారు. అభిషేకం వల్ల దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. అభిషేకం చేయడం వలన ఆరోగ్యం, ఐశ్వర్యం, శ్రేయస్సు, సంతానం వంటి ప్రయోజనాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.