విపక్షాల ట్రాప్‎లో పడొద్దు: గ్రూప్- 1 వివాదంపై మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

విపక్షాల ట్రాప్‎లో పడొద్దు: గ్రూప్- 1 వివాదంపై మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్:  రాష్ట్రంలో హాట్ టాపిక్‎గా మారిన గ్రూప్-1 మెయిన్స్ వివాదంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఆదివారం (అక్టోబర్ 20) గాంధీ భవన్‎లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగులు విపక్షాల ‎ట్రాప్‏లో పడొద్దని సూచించారు. జీవో నెం 29పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. జీవో నెం 29తో రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు ఎలాంటి నష్టం జరగదని క్లారిటీ ఇచ్చారు. ఎందరో నిపుణులతో చర్చలు జరిపిన తర్వాతే జీవో నెం 29 తీసుకువచ్చామని స్పష్టం చేశారు. జీవో నెం 29తో విద్యార్థులకు నష్టం లేదని తెలుసుకున్నాకే ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నానని అన్నారు. 

గ్రూప్-1 విషయంలో విపక్షాలది అనవసర రాద్ధాంతం అని.. అభ్యర్థులను తప్పుదోవ పట్టించి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కై అభ్యర్థులను రెచ్చగొడుతున్నాయని సీరియస్ అయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని.. అందులో భాగంగానే నిరుద్యోగుల జీవితాలతో రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్‎కు ఫక్తు రాజకీయాలే కావాలనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read :- డీఎస్పీపై కోపంతో రగిలిపోతున్న మహేశ్ ఫ్యాన్స్

గ్రూప్-1 పరీక్షలు ఇప్పుడు వాయిదా పడితే మళ్లీ ఎప్పుడు జరుగుతాయో తెలియదని.. పరీక్ష రాసేందుకు వేల మంది అభ్యర్థులు  సిద్ధంగా ఉన్నారన్నారు. ఏ ఒక్క అభ్యర్థికి అన్యాయం జరగనివ్వమని భరోసా ఇస్తున్నాం.. సీఎం, మంత్రులతో మాట్లాడాకే  నేను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఒక్కసారి గ్రూప్-1 నిర్వహించిన పాపాన పోలేదని.. ఇప్పుడు నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ పట్టుమని 70 వేల ఉద్యోగాలు ఇవ్వలేదు.. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ప్రధాని మోడీ హామీ ఏమైందో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు.