
- ఆఫీసర్ల తీరుపై మండిపడ్డ ప్రజలు
అచ్చంపేట, వెలుగు : తమ ప్రాణాలు పోయినా మైనింగ్ జరగనిచ్చేది లేదని నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం మైలారం గ్రామస్తులు తేల్చి చెప్పారు. మైలారం గుట్టపై పలుగురాళ్ల తవ్వకానికి ఆఫీసర్లు గతంలో అనుమతులు ఇవ్వడంతో గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కొన్ని రోజులపాటు మైనింగ్ను నిలిపివేస్తూ ఆఫీసర్లు నిర్ణయం తీసుకున్నారు. అయితే అడిషనల్ కలెక్టర్ అమరేందర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి సురేశ్బాబు, మైనింగ్ ఆఫీసర్లు కలిసి ప్రజాభిప్రాయసేకరణ చేపట్టేందుకు గురువారం మైలారం వచ్చారు.
కొందరు వ్యక్తులతో కలిసి మైలారం గుట్టపైకి వెళ్లి సమావేశం నిర్వహించిన అనంతరం హద్దులు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు గుట్టపైకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులను అనుమతించకుండా ప్రజాభిప్రాయ సేకరణ ఎవరితో చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫీసర్లు మైనింగ్ వ్యాపారులతో కుమ్మక్కై ప్రజలను అడ్డుకొని తీర్మానాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. అనంతరం ఆఫీసర్లకు వినతిపత్రం ఇచ్చారు.