
- మార్కెట్ మండే.. సెన్సెక్స్, నిఫ్టీ ఇంట్రాడేలో 5 శాతం పతనం
- కరోనా సంక్షోభం తర్వాత అతిపెద్ద సింగిల్ డే లాస్
- ముదురుతున్న ట్రేడ్ వార్.. భయపడుతున్న ఇన్వెస్టర్లు
- భారీగా పడ్డ మెటల్, రియల్టీ, ఆటో, బ్యాంక్ షేర్లు
- మన కంటే ఎక్కువ నష్టపోయిన గ్లోబల్ మార్కెట్లు
ట్రంప్ దెబ్బకు మార్కెట్లు కుదేలయ్యాయి. మరో బ్లాక్ మండే సెషన్లో ఇన్వెస్టర్లు రూ.14 లక్షల కోట్లు నష్టపోయారు. చిన్న, పెద్ద అన్ని షేర్లు ఇన్వెస్టర్లకు చుక్కలు చూపించాయి. గ్లోబల్ మార్కెట్లయితే ఇండియా కంటే దారుణంగా పడ్డాయి. హాంకాంగ్ మార్కెట్ ఇంట్రాడేలో 15 శాతం పతనమవ్వగా, జపాన్ 10 శాతం పడింది. ఇంగ్లండ్, ఫ్రాన్స్, జర్మనీ మార్కెట్లు 5 శాతం చొప్పున పడ్డాయి. గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి పడిపోతుందనే భయాలతో బ్రెంట్ క్రూడాయిల్ ధర పడగా, రూపాయి విలువ రెండు నెలల కనిష్టానికి పతనమైంది. గోల్డ్ ధరలూ దిగొచ్చాయి.
బిజినెస్డెస్క్, వెలుగు: ట్రంప్ దెబ్బకు ఇండియన్ స్టాక్ మార్కెట్లు సోమవారం కుదేలయ్యాయి. గ్లోబల్ మార్కెట్లతో పాటే భారీ నష్టాలను చవి చూశాయి. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వేసిన టారిఫ్లపై అదే రీతిలో చైనా స్పందించడంతో ట్రేడ్వార్ ముదురుతుందనే భయాలు ఎక్కువయ్యాయి. యూఎస్ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటుందనే అంచనాలు పెరిగాయి.
దీంతో సోమవారం బెంచ్మార్క్ ఇండెక్స్లు కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఓపెనింగ్ సెషన్లో 5 శాతానికి పైగా పతనమయ్యాయి. మార్నింగ్ సెషన్లో ఇన్వెస్టర్లు రూ.20 లక్షల కోట్లు నష్టపోయారు. చివరిలో ఇండెక్స్లు రికవర్ కావడంతో ఇన్వెస్టర్ల లాస్ తగ్గింది. అమెరికా నుంచి ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్న చాలా కంపెనీల షేర్లు భారీగా పడ్డాయి.
సెన్సెక్స్ సోమవారం 3,939.68 పాయింట్లు (5.22 శాతం) పతనమై 71,425.01 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 2.95 శాతం (2,227 పాయింట్ల) నష్టంతో 73,138 వద్ద సెటిలయ్యింది. నిఫ్టీ 1,160.80 పాయింట్లు (5 శాతం) పడి 21,743.65 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేయగా, 3.24 శాతం (743 పాయింట్ల) నష్టంతో 22,162 వద్ద ముగిసింది. కరోనా సంక్షోభం టైమ్లో అంటే మార్చి 2020 తర్వాత మార్కెట్కు ఇదే వరెస్ట్ ఓపెనింగ్. జూన్ 4, 2024 తర్వాత అతిపెద్ద సింగిల్ డే లాస్. సెన్సెక్స్లో హిందుస్తాన్ యూనిలీవర్ మినహా మిగిలిన అన్ని షేర్లు నష్టాల్లో ముగిశాయి. టాటా స్టీల్ (7 శాతం), ఎల్ అండ్ టీ (6 శాతం), కోటక్ బ్యాంక్ (4.313 శాతం), ఎం అండ్ ఎం (5.31 శాతం) ఎక్కువగా పడ్డాయి.
హిస్టరీలో అతిపెద్ద నష్టాలు..
2004 జనరల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలవడంతో నిఫ్టీ మే 17, 2004న ఇంట్రాడేలో 18.3 శాతం క్రాష్ అయ్యింది. బ్రోకరేజ్ కంపెనీ ఎమ్కే తప్పుగా ఆర్డర్లను ప్లేస్ చేయడంతో అక్టోబర్ 5,2012న 15.5 శాతం క్రాష్ అయ్యింది. గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ దెబ్బకు 22 జనవరి, 2008 న 14.6 శాతం పడగా, ఈ సంక్షోభం ముదరడంతో అక్టోబర్ 24, 2008 న 14.2 శాతం పడింది. కరోనా కేసులు పెరగడంతో 23 మార్చి, 2020 న 13.3 శాతం పతనమైంది.
మార్కెట్ కుప్పకూలడానికి ప్రధాన కారణాలు
టారిఫ్ వార్ ముదురుతుండడం: సుమారు అన్ని దేశాలపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు వేశారు. చైనాపై అయితే అందరికంటే ఎక్కువగా 34 శాతం విధించారు. చైనా కూడా అదే రీతిలో ప్రతీకార సుంకాలను వేసింది. ఇరు దేశాల మధ్య ట్రేడ్ వార్ తీవ్రంగా మారింది. ప్రపంచ మార్కెట్లు పడడానికి ఇదొక కారణం. ట్రంప్ తన సుంకాల నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. మార్కెట్ పతనం సాధారణమని తేల్చి చెప్పారు.
రెసిషన్ భయాలు: యూఎస్ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి (రెసిషన్లోకి) జారుకుంటుందనే అంచనాలు ఎక్కువయ్యాయి. రాబోయే 12 నెలల్లో అమెరికా ఎకానమీ రెసిషన్లోకి జారుకోవడానికి 45 శాతం ప్రాబబిలిటీ ఉందని ఫైనాన్షియల్ కంపెనీ గోల్డ్మన్ శాక్స్ అంచనా వేసింది. గతంలో ఈ అంచనా 35 శాతంగా ఉండేది. ఈ ఏడాదిలోనే యూఎస్ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి ప్రవేశించవచ్చని జేపీ మోర్గాన్ చేజ్ హెచ్చరించింది.
గ్లోబల్ మార్కెట్ల ఎఫెక్ట్: ఆసియా మార్కెట్లు సోమవారం సెషన్లో యూఎస్ మార్కెట్లను ఫాలో అయ్యాయి. హాంకాంగ్ హాంగ్ సెంగ్ ఇంట్రాడేలో దాదాపు 15 శాతం క్షీణించగా, టోక్యో నిక్కీ 10 శాతం, షాంఘై కాంపోజిట్ 10 శాతం, దక్షిణ కొరియా కోస్పీ 5 శాతం పతనమయ్యాయి. జపాన్ స్టాక్ ఫ్యూచర్స్ మార్నింగ్ సెషన్లో లోయర్ సర్క్యూట్ను టచ్ చేయడంతో కొద్దిసేపు ట్రేడింగ్ను ఆపారు. కాగా, యూఎస్ ఎస్అండ్పీ 500 శుక్రవారం 5.97 శాతం, నాస్డాక్ 5.82 శాతం, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 5.50 శాతం క్షీణించిన విషయం తెలిసిందే. సోమవారం సెషన్లో మాత్రం ఇంట్రాడే నష్టాల నుంచి కోలుకున్నాయి.
ఇండియా విక్స్ జూమ్: మార్కెట్లో ఇన్వెస్టర్ల భయాన్ని సూచించే ఇండియా విక్స్ ఇండెక్స్ సోమవారం 66 శాతం పెరిగి 22.79 కి చేరుకుంది. దీనినిబట్టి మార్కెట్లో వోలటాలిటీ కొనసాగుతుందని అంచనావేయొచ్చు.
2,640 షేర్లు నష్టాల్లో: ఎన్ఎస్ఈలో 3,308 షేర్లు ట్రేడవ్వగా, ఇందులో 2,640 షేర్లు నష్టపోయాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, టైటాన్, ఎల్ అండ్ టీతో సహా775 షేర్లు తమ ఏడాది కనిష్టానికి పడ్డాయి. వోకార్డ్, కేఫిన్ టెక్, శార్దా ఎనర్జీతో సహా 384 షేర్లు లోయర్ సర్క్యూట్ను టచ్ చేశాయి.
చైనా, జపాన్ బెంచ్మార్క్ ఇండెక్స్లు వరుసగా 10 శాతం మేర పడ్డాయి. గ్లోబల్గా ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్ 10 నుంచి అన్ని యూఎస్ దిగుమతులపై 34 శాతం ప్రతీకార సుంకాన్ని విధించాలని చైనా నిర్ణయించడంతో పరిస్థితులు మరింతగా దిగజారాయి..
- రిలయన్స్ సెక్యూరిటీస్
రీసెర్చ్ హెడ్ వికాస్ జైన్.
నిఫ్టీ 21,700 లెవెల్ కోల్పోతే 21,300 వరకు పడొచ్చు. మరోవైపు 22,500–22,800 వద్ద రెసిస్టెన్స్ ఉంది. స్టెబిలిటీ వచ్చేంత వరకు ట్రేడర్లు జాగ్రత్తగా ఉండాలి. పొజిషన్ల సైజ్ను తగ్గించుకోవాలి. హెడ్జింగ్ చేసుకోవాలి..
- రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా.