
- మణికొండలో అగ్నిప్రమాదం..ముగ్గురు మృతి
- మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి
- గ్రౌండ్ఫ్లోర్ కిరాణ దుకాణం పక్కన షార్ట్ సర్క్యూట్
- పైపోర్షన్లకు వ్యాపించిన మంటలు.. పేలిన 2 సిలిండర్లు
- దగ్ధమైన కిరాణం షాపు, కారు
- పైనుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న కొందరు
- తాళ్లతో పిల్లలను కిందకు దించిన స్థానికులు
గండిపేట్, వెలుగు: రంగారెడ్డి జిల్లా గండిపేట మం డలం మణికొండలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపో యారు. ఐదుగురు గాయపడ్డారు. మృతుల్లో వృద్ధురాలు, చిన్నారి, మహిళ ఉన్నారు. పుప్పాలగూడ పాషా కాలనీలోని ఓ అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉస్మాన్.. కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు.
దీని పక్కన మెట్లుండే ప్రాంతంలో సాయంత్రం ఐదున్నర గంటలకు షార్ట్సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఆ టైంలో షాపు మూసేసిన ఉస్మాన్పైకి వెళ్లడంతో మంటలను గుర్తించలేకపోయాడు. మెట్ల పక్కన రెండు ఫుల్ సిలిండర్లు, ఒక ఖాళీ సిలిండర్ ఉన్నాయి. అవి పేలడంతో మంటలు తీవ్ర రూపం దాల్చాయి. షాపు పక్కనే ఉన్న బ్యాటరీ కారు తగలబడింది. కిరాణా షాపు కూడా దగ్ధమైంది.
మం టలు కింది నుంచి రెండో అంతస్తులోకి వ్యాపించాయి. అప్పుడు ఆ బిల్డింగులో మొత్తం11 మంది ఉన్నారు. ఇందులో మంటలను గుర్తించిన ఎనిమిది మంది కేకలు వేస్తూ బయటకు పరిగెత్తారు. కిందకు వెళ్లడానికి మార్గం లేకపోవడంతో రెండో అంతస్తుకు పరుగులు తీశారు. తమను కాపాడమంటూ కేకలు వేశారు. అయితే, ఆ టైంలో మొదటి అంతస్తులోని ఒక రూంలో ఇద్దరు మహిళలు, మరో పాప గడియ పెట్టుకుని గాఢ నిద్రలో ఉన్నారు.
వీరిని మిగతా కుటుంబ సభ్యులు కూడా గమనించలేదు. రెండో అంతస్తు నుంచి కేకలు విన్న స్థానికులు అగ్నిమాప క సిబ్బందితో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చా రు. ఈలోపు మంటలు ఆర్పేందుకు స్థానికులు నీళ్లు కొట్టారు. కొందరిని పైనుంచి కిందకు దించేందుకు ప్రయత్నించారు. కింద ఓ పరుపు పట్టుకుని కిందకు దూకాలని సూచించారు. రెండో ఫ్లోర్ నుంచి నలుగురు కిందకు దూకగా, ఒకరి కాలు విరిగిపోయింది.
మరో ముగ్గురికి కూడా గాయాలయ్యాయి. పక్కింటి వాళ్లు తాళ్లను బిల్డింగ్ పైకి విసరడంతో వాటి ఆధా రంగా మరో ముగ్గురు కిందకు వచ్చారు. ఇంతలో వచ్చిన ఫైర్ సిబ్బంది.. ఫైర్ ఇంజిన్ నిచ్చెనతో మరొకరిని కిందకు తీసుకువచ్చారు.
గాఢనిద్ర, గమనించకపోవడమే కారణం
ప్రమాదం జరిగినప్పుడు మొదటి అంతస్తులోని గదిలో జమీలా ఖాటూన్(70), సహానా ఖాటూన్(38), సిజ్రా ఖాటూన్ (7) నిద్రపోతున్నారు. వాళ్ల దగ్గర సెల్ ఫోన్ఉన్నా దాన్ని సైలెంట్ మోడ్లో పెట్టుకున్నారు. దీంతో మంటలు అంటుకున్నప్పుడు బయటకు పరిగెత్తిన వీరి బంధువులు.. కాల్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దీంతో బయట ఎక్కడో ఉండవచ్చని అనుకున్నారు.
అయితే.. మంటలు వ్యాపించడం, భారీగా పొగ రావడంతో అది పీల్చిన వారు నిద్రలోనే అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. మంటలు తగ్గాక ఫస్ట్ ఫ్లోర్ రూమ్కు వెళ్లి తలుపులు పగలగొట్టగా, ఆ ముగ్గురు అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే వారిని దవాఖానకు తరలించగా అప్పటికే చనిపోయారని డాక్టర్లు ప్రకటించారు.