
- ఎన్నికల సంఘానికి పంచాయతీరాజ్ శాఖ లేఖ
- వార్డుల, ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ తాత్కాలికంగా నిలపాలని విజ్ఞప్తి
భద్రాచలం, వెలుగు : భద్రాచలం, సారపాక మేజర్ పంచాయతీలకు భారీ ఊరట లభించింది. గత ప్రభుత్వం ఈ పంచాయతీలను చీలికలు, పీలికలు చేస్తూ జీవో నంబర్ 45ను తీసుకొచ్చింది. భద్రాచలంను భద్రాచలం, సీతారామనగర్, శాంతినగర్, బూర్గంపాడు మండలంలోని సారపాక పంచాయతీని సారపాక, ఐటీసీలుగా విభజించాలని ఈ బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసి గవర్నర్కు పంపించింది. కానీ రెండు పంచాయతీల్లో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు తీవ్రంగా నిరసన కార్యక్రమాలు చేపట్టి ‘విభజన వద్దు.. ఒకటే ముద్దు’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అప్పటి భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటే పంచాయతీగా ఉంచుతామని హామీ ఇచ్చింది.
కానీ కొత్త ప్రభుత్వం వచ్చాక అప్పటి బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ప్రజలు బెంబేలెత్తారు. ఇటీవల పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ రావడంతో వార్డులు, ఓటర్ల జాబితాను తయారు చేయడానికి రంగం సిద్ధం అయ్యింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ప్రజాభీష్టానికి తలొగ్గింది. తిరిగి ఒకటే పంచాయతీగా ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగానే ఈనెల 12న పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. భద్రాచలం, సారపాకలలో వార్డులు, ఓటర్ల జాబితా తయారీని ఆపాలని కోరారు. తిరిగి వీటికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసి ఒకే పంచాయతీగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.