
- షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ కమిటీ ఏర్పాటుతో రంగంలోకి కాంగ్రెస్
- పసుపు బోర్డు ప్రకటనతో బీజేపీ.. రైతుల సమస్యల పేరిట బీఆర్ఎస్
- గత ఎన్నికల్లో కవితను ఓడించిన పసుపు బోర్డు ఇష్యూ
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా రాజకీయం రైతుల చుట్టూ తిరుగుతోంది. గత ఎంపీ ఎన్నికల్లో రైతుల ఓట్లే అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయడంతో, ఈసారీ వారే కీలకంగా మారనున్నారు. దీంతో ప్రధాన పార్టీలు రైతుల ఓట్లపై ఫోకస్ చేశారు. షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామన్న ప్రకటనతో కాంగ్రెస్ ప్రచారంలో దూసుకుపోతుండగా.. పసుపు బోర్డు ఇచ్చామని బీజేపీ ప్రచారం చేసుకుంటోంది. తమ హయాంలో రైతులకు అమలుచేసిన పథకాలు తమకు లాభిస్తాయని బీఆర్ఎస్ భావిస్తోంది. మొత్తంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రైతులే కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు.
రీఓపెన్కు కాంగ్రెస్ కసరత్తు
2015 డిసెంబర్23న నిజాం షుగర్ ఫ్యాక్టరీలకు యూనిట్లు లే ఆఫ్ ప్రకటించాయి. అప్పటి నుంచి చెరుకు రైతులతోపాటు కార్మికులు ఉపాధి కోల్పోయి పోరుబాట పట్టారు. రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, పీసీసీ చీఫ్ హోదాలో సీఎం రేవంత్రెడ్డి నిజాం షుగర్ ఫ్యాక్టరీ రీ ఓపెన్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు రీ ఓపెనింగ్కు కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సిఫార్సులు రెడీ చేసే పనిలో ఉంది. ఇటీవల నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా హాజరైన సీఎం సెప్టెంబర్ 17న షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని ప్రకటించడంతో రైతులు, కార్మికుల్లో ఆశలు రేకెత్తాయి. దీంతో రైతులు తమకు మద్దతుగా నిలుస్తారని కాంగ్రెస్ భావిస్తోంది.
ఫలితాలను మార్చిన పసుపు బోర్డు ఇష్యూ
గత పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డు ఏర్పాటు హామీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసింది. అప్పటి బీజేపీ అభ్యర్థి అర్వింద్ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్న హామీతో బాండ్ పేపర్తో ప్రచారం చేశాడు. ఇదే ఇష్యూలో అప్పటికే నాటి సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ అభ్యర్థి కవితపై పసుపు రైతులు అసంతృప్తిగా ఉన్నారు. షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ చేయకపోవడంతో చెరుకు రైతులు, కార్మికులు సైతం ఆమె వ్యతిరేకంగా మారారు.
దీంతో కొందరు పసుపు రైతులు భారీ సంఖ్యలో నామినేషన్లు వేసి పోటీ చేయడం అప్పటి చేయడంతో కవిత ఓటమి పాలయ్యారు. బీజేపీ ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. కానీ ఇప్పటిదాకా ఏర్పాటు కాలేదు. దీంతోపాటు మూతపడిన నిజాం షుగర్ఫ్యాక్టరీలను తెరిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటనతోపాటు షుగర్ ఫ్యాక్టరీ అంశంతో రైతుల ఓట్లను దక్కించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ తన పదేళ్ల పాలనలో రైతులకు అమలుచేసిన పథకాలు, సంక్షేమంపై ఆపార్టీ ఆశలు పెట్టుకుంది.
బీఆర్ఎస్ ఓటు బ్యాంక్పై గురి
నిజామాబాద్ పార్లమెంట్ బరిలో మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ల నుంచి జీవన్ రెడ్డి, అర్వింద్, బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో ఉన్నారు. రాష్ట్రంలో ఆధికారం కోల్పోవడంతోపాటు, మాజీ ఎంపీ కవిత జైలుపాలు కావడం ఆపార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో పాటు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడంతో ఇప్పటికీ వ్యతిరేకత కొనసాగుతూనే ఉంది. ఈక్రమంలో బీఆర్ఎస్ ఓటుబ్యాంకును తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.