
- రూ. 60 వేల పైన అందుకుంటున్నవారు చాలా తక్కువ
- ఆర్థిక ఇబ్బందుల్లో ఉద్యోగులు
- స్కిల్స్ పెంచాలని, జీతాలపై సంస్కరణలు తేవాలి: వర్క్ఇండియా రిపోర్ట్
న్యూఢిల్లీ: చాలా మంది బ్లూ కాలర్ ఉద్యోగులు (ఫ్యాక్టరీల్లోని లేబర్లు, ఆఫీసుల్లో కాకుండా బయట మాన్యువల్గా పనిచేసేవారు) నెలకు రూ.20 వేల కంటే తక్కువ జీతం అందుకుంటున్నారని రిపోర్ట్ ఒకటి పేర్కొంది. వీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. హౌసింగ్, హెల్త్కేర్, ఎడ్యుకేషన్ వంటి ప్రాధమిక అవసరాలను చేరుకోవడానికి కూడా కష్టపడుతున్నారని రిక్రూట్మెంట్ ప్లాట్ఫామ్ వర్క్ఇండియా రిపోర్ట్ వివరించింది. ఈ రిపోర్ట్ ప్రకారం, దేశంలోని బ్లూ వర్క్ ఉద్యోగుల్లో 57.63 శాతం మంది జీతం నెలకు రూ.20 వేల లోపు ఉంది. దీనిని బట్టి మెజార్టీ ఉద్యోగులు కనీస వేతనాలను మాత్రమే అందుకుంటున్నారని తెలుస్తోంది.
మరో 29.34 శాతం మంది బ్లూ కాలర్ ఉద్యోగులు నెలకు రూ.20 వేల నుంచి రూ.40 వేల మధ్య జీతం పొందుతున్నారు. ఈ కేటగిరీలోని ఉద్యోగుల ఆర్థిక పరిస్థితులు కొంత మెరుగ్గా ఉన్నా, జీవన ప్రమాణాలు గొప్పగా లేవు. వీరి శాలరీతో ప్రాధమిక అవసరాలు తీరుతున్నా, పొదుపు చేసుకోవడానికి లేదా ఇన్వెస్ట్మెంట్కు తక్కువ మిగులుతోంది. ‘బ్లూ కాలర్ సెగ్మెంట్లో ఎక్కువ శాలరీ పొందడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. చాలా మంది తక్కువ జీతాలు పొందుతున్న వారే ఉన్నారు. ఈ రిపోర్ట్తో కేవలం మెజార్టీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక అసమానతల గురించే కాకుండా ఆర్థిక వృద్ధి, సామాజిక స్థిరత్వంపై పడుతున్న నెగెటివ్ ప్రభావం గురించి తెలుస్తోంది’ అని వర్క్ ఇండియా సీఈఓ నీలేశ్ దుంగర్వాల్ అన్నారు.
ఉద్యోగుల స్కిల్స్ మెరుగుపరచడం, జీతాలకు సంబంధించి సంస్కరణలు తేవడం, ఎక్కువ శాలరీస్ ఇచ్చే జాబ్స్ను క్రియేట్ చేయడంతో చాలా సమస్యలు పరిష్కరించొచ్చని వివరించారు. వర్క్ ఇండియా రిపోర్ట్ ప్రకారం కేవలం 10.71 శాతం మంది బ్లూ కాలర్ వర్కర్లు మాత్రమే నెలకు రూ.40 వేల నుంచి రూ.60 వేల జీతం అందుకుంటున్నారు. అనుభవం ఉన్నవారు లేదా స్పెషల్ స్కిల్స్ ఉన్నవారికి హై శాలరీస్ అందుతున్నాయి. నెలకు రూ.60 వేల కంటే ఎక్కువ శాలరీస్ అందుకుంటున్నవారు కేవలం 2.31 శాతం మంది మాత్రమే ఉన్నారు. కీలక పొజిషన్లలో ఉన్నవారు లేదా కీలకమైన స్పెషల్ స్కిల్స్ ఉన్నవారికి మాత్రమే ఇలాంటి శాలరీ అందుతోంది.
బ్లూ కాలర్ జాబ్స్లో ఈ రోల్స్కు గిరాకి
ఫీల్డ్లోకి వెళ్లి అమ్మకాలు జరిపే వారికి ఎక్కువ శాలరీస్ అందుతున్నాయి. నెలకు రూ.40 వేల కంటే ఎక్కువ జీతం అందుకుంటున్న బ్లూ కాలర్ ఉద్యోగుల్లో ఈ జాబ్ చేస్తున్నవారి వాటా 33.84 శాతంగా ఉంది. బ్యాక్ ఆఫీస్ రోల్స్లో చేసే వారి వాటా 33.10 శాతంగా, టెలీకాలర్ల వాటా 26.57 శాతంగా ఉంది. బిజినెస్ డెవలప్మెంట్ జాబ్స్ చేసేవారికి హై శాలరీస్ అందుతున్నాయి. డెలివరీ వర్క్ చేసేవారిలో తక్కువ మంది హై శాలరీస్ పొందుతున్నారు.
ఇంకో ఆరేళ్లలో సుమారు 15 కోట్ల ఉద్యోగాలు అవసరం
ఉద్యోగాల కల్పనలో ఇతర జీ20 దేశాలతో పోలిస్తే ఇండియా వెనకబడిందని, 2030 నాటికి అదనంగా సుమారు 15 కోట్ల ఉద్యోగాలను క్రియేట్ చేయాలని ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండీ గీతా గోపీనాథ్ పేర్కొన్నారు. ఇండియా జీడీపీ 2010 నుంచి ఏడాదికి సగటున 6.6 శాతం వృద్ధి చెందిం దని, కాని ఉద్యోగాల కల్పన మాత్రం 2 శాతం కంటే తక్కువ పెరిగిందని వివరించారు.
దేశంలో జనాభా వృద్ధిని బట్టి 2030 నాటికి 6 కోట్ల నుంచి 14.80 కోట్ల ఉద్యోగాలను ఇండియా క్రియేట్ చేయాల్సి ఉంటుందని, ఇప్పుడు మనం 2024 లో ఉన్నామని, తక్కువ టైమ్లోనే భారీగా జాబ్స్ క్రియేట్ చేయాలని పేర్కొన్నారు. జాబ్స్ పెరగాలంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ పెరగాలన్నారు. పని చేయగలిగే వారి స్కిల్స్ పెంచాలని, ఎడ్యుకేషన్ సిస్టమ్ను మెరుగుపరచాలని, ఈజ్ ఆఫ్ డూ యింగ్ బిజినెస్ను మెరుగుపరిచేందుకు రూల్స్, ట్యాక్స్ భారాన్ని తగ్గించాలని సలహా ఇచ్చారు.