మాలలకు జరిగిన అన్యాయంపై ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గళమెత్తాలి : చైర్మన్​చెన్నయ్య

మాలలకు జరిగిన అన్యాయంపై ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గళమెత్తాలి : చైర్మన్​చెన్నయ్య
  • మాల సంఘాల జేఏసీ చైర్మన్​చెన్నయ్య 

ఖైరతాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణలో మాలలు, మాల ఉపకులాలకు జరిగిన అన్యాయంపై ఆ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గళమెత్తాలని మాల సంఘాల జేఏసీ చైర్మన్​జి. చెన్నయ్య కోరారు. మాల జాతికి జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించకపోతే ఆయా ఎమ్మెల్యేలు జాతి ద్రోహులుగా మిగిలిపోతారని తెలిపారు. గురువారం మాల సంఘాల జేఏసీ నాయకులు బూర్గుల వెంకటేశ్వర్లు, గోపోజు రమేశ్​బాబు, మన్నె శ్రీధర్, ఎస్. సత్యనారాయణ, ఎమ్ఎమ్. సరళ, జంగా శ్రీనివాస్​లతో కలిసి ప్రెస్​క్లబ్​లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ.. వర్గీకరణపై షమీమ్​అక్తర్ ఏకసభ్య కమిషన్ ఇచ్చిన​నివేదిక తప్పుల తడకగా ఉందని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించొద్దని కోరారు. మంద కృష్ణ మాదిగ ఒత్తిడికి తలొగ్గి బిల్లుకు సీఎం రేవంత్​రెడ్డి చట్టబద్ధత తీసుకొస్తే  నిరసనలతో రాష్ట్రం అగ్ని గుండంలా మారుతుందని చెప్పారు. మంద కృష్ణ మాదిగ బీజేపీతో అంటకాగుతూ సీఎంను బెదిరించే స్థాయికి వచ్చారని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధంగా ఎంపరికల్​డేటా లేకుండా కులాలు, గ్రూపుల వారీగా విభజించిన వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని వివరించారు.