
నేరడిగొండ , వెలుగు: ఎస్సీ వర్గీకరణ పై ప్రభుత్వం పున:పరిశీలించాలని మాల సంక్షేమ సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేశ్ కోరారు . నేరడిగొండ మండల కేంద్రంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ను మంగళవారం జిల్లా మాల సంక్షేమ సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు . ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణలో జరిగిన తప్పులను సరిదిద్ది సుప్రీం కోర్టు జడ్జిమెంట్ లో సూచించినట్లుగా లబ్ధిదారుల డేటాను తయారు చేయాలని కోరారు .
దీంతో ఏ కులం వారు లబ్ధి పొందారో, ఏ కులం వారు వెనుకబడ్డారనేది స్పష్టం అవుతుందని అన్నారు . దీనిపై రానున్న బడ్జెట్ సమావేశాల్లో చర్చించాలని ఎమ్మెల్యేను కోరారు . ఎస్సీ వర్గీకరణను పున: సమీక్షించి 2024 జనాభా లెక్కల ప్రకారం మాలలకు న్యాయం చేయాలని కోరారు . కార్యక్రమంలో మాల సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మేకల మల్లన్న , ఉపాధ్యక్షుడు కుర్మే నారాయణ స్వామి , మండల అధ్యక్షుడు నక్క మహేందర్ , అనుపట్ల సంజీవ్ కుమార్ , బోథ్ , ఇచ్చోడ , వివిధ మండలాల అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు .