
- మల్క కొమరయ్యది చారిత్రక విజయం
- కరీంనగర్లో కమలం పార్టీ విజయోత్సవ ర్యాలీ
కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్, నిజామాబాద్, మెదక్ , ఆదిలాబాద్ టీచర్ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ చరిత్ర సృష్టించిందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్యది చారిత్రక విజయమని పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్లో బీజేపీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయం నుంచి కోర్టు చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. మల్క కొమరయ్య విజయంలో ‘తపస్’ ప్రధాన భూమిక పోషించిందని చెప్పారు.
తపస్ నాయకత్వం ఈ ఎన్నికల్లో కష్టపడిన తీరు, దూకుడు చూసి ప్రస్తుతం ఉపాధ్యాయ సంఘాల్లో అలజడి మొదలైందని, ఎంతోమంది ఉపాధ్యాయులు ‘తపస్’వైపు చూస్తున్నారన్నారు. ప్రధాని మోదీ పాలనపై నమ్మకం ఉంచి ఉపాధ్యాయులు కొమరయ్యకు ఓట్లు వేశారని అన్నారు. ఈ వ్యతిరేకతను గ్రహించి అయినా.. ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సిన ప్రమోషన్లు, బెనిఫిట్స్ను తప్పకుండా ఇవ్వాలన్నారు. బీజేపీ శకం ఆరంభమైందని, కిషన్ రెడ్డి నాయకత్వంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు.