
మెదక్, వెలుగు: మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కొడుకు డాక్టర్ మైనంపల్లి రోహిత్ మళ్లీ యాక్టివ్అయ్యారు. మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ రోహిత్.. కొద్ది రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ నియోజకవర్గంలో పర్యటనలు, సేవా కార్యక్రమాలు షురూ చేశారు. బుధవారం హవేలి ఘనపూర్ మండలం గాజిరెడ్డిపల్లిలో సొంత నిధులతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. ఏడుగురు పిల్లల పేర్లమీద రూ.25 వేల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ పత్రాలను పంపిణీ చేశారు. గుడికి రూ.లక్ష విరాళాన్ని అందజేశారు.
ఇతర మండలాల్లోనూ పర్యటనలు, సేవా కార్యక్రమాలు కొనసాగించేలా ప్రణాళిక రెడీ చేసుకున్నారు. తన కొడుకు రోహిత్కు మెదక్ టికెట్ వస్తుందని హన్మంతరావుఆశించినప్పటికీ.. పార్టీ అధినేత కేసీఆర్అతనికి టికెట్ కేటాయించలేదు. అందుకు మంత్రి హరీశ్రావే కారణమని హన్మంతరావు ఫైర్అయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా తన కొడుక్కి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు. ఈ నెల 26న మల్కాజ్ గిరితోపాటు, మెదక్ సెగ్మెంట్కు చెందిన నాయకులు, కార్యకర్తలతో సమావేశమై.. వారం రోజుల్లో తన కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. ఈ క్రమంలో వారం గడవక ముందే రోహిత్మళ్లీ మెదక్ సెగ్మెంట్లో పర్యటిస్తూ సోషల్ సర్వీస్ కొనసాగిస్తున్నారు. దీంతో అతడు తప్పకుండా ఎన్నికల బరిలో ఉంటారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతున్నది. అయితే, అతడు ఏదైనా పార్టీ తరఫున పోటీ చేస్తారా? లేదా ఇండిపెండెంట్ గా బరిలో నిలుస్తారా? అన్నదానిపై మాత్రం సస్పెన్స్ నెలకొంది.