
మెదక్, వెలుగు: మెదక్ జిల్లాకు పట్టిన శని మంత్రి హరీశ్ రావు అని.. ఆ శని వదిలించడమే తమ లక్ష్యమని మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం పట్టణ కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. హరీశ్ రావు పొద్దున లేస్తే మెదక్ మీద పడుతున్నడు.. ఆయనకు మెదక్తో ఏం పనని ప్రశ్నించారు. తాము మెదక్ జిల్లా ఏర్పాటు చేశామని గొప్పలు చెబుతున్నారని కానీ బ్రిటీష్ కాలంలోనే మెదక్ జిల్లా ఏర్పడిందన్నారు.
మెదక్లో ఉన్న అనేక ఆఫీస్లను సిద్దిపేటకు తరలించారని మండిపడ్డారు. మెదక్ పట్టణానికి కనీసం బైపాస్ రోడ్డు నిర్మించలేదని విమర్శించారు. మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ ఏ పదవులు లేకున్నా స్వచ్ఛందంగా సొంత డబ్బులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానన్నారు. డబ్బు సంపాదన కోసం కాకుండా మెదక్ సమగ్ర అభివృద్ధి కోసమే తాను ఎన్నికల బరిలో నిలుస్తున్నానన్నారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్ సుప్రభాత్ రావు, ఆంజనేయులు, సురేందర్, ప్రభాకర్, రాంచందర్, రాజిరెడ్డి, పండరి, జీవన్ రావు, హఫీజ్, రమేశ్, శ్రీనివాస్, అమీరొద్దీన్, అలీ బేగ్ పాల్గొన్నారు.