
హైదరాబాద్: మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదైంది. మల్కాజ్ గిరి MLA మర్రి రాజశేఖర్ రెడ్డిపై యేసుబాబు అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. విజన్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీస్ను రూ.20 లక్షలకు మోసం చేశారని మర్రి రాజశేఖర్పై పోలీసులకు యేసు బాబు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. విజన్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీస్ ద్వారా మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న అరుంధతి హాస్పిటల్కు 40 మంది సిబ్బందిని కేటాయించారు. మొత్తం రూ.50 లక్షలు ఇచ్చేందుకు రాజశేఖర్ రెడ్డి ఒప్పుకున్నారు.
పలు దఫాలుగా రూ.30 లక్షలను రాజశేఖర్ రెడ్డి చెల్లించారు. మిగిలిన డబ్బులు ఇవ్వాలని అడిగితే మల్లారెడ్డి అల్లుడు స్పందించలేదు. దీంతో.. -డబ్బులు ఇవ్వడం లేదని పోలీసులను యేసుబాబు ఆశ్రయించాడు. రాజశేఖర్ రెడ్డిపై BNS చట్టం ప్రకారం చీటింగ్ కేసు నమోదైంది. పేట్ బషీరాబాద్ పీఎస్లో 316/2,318(4) సెక్షన్ల కింద FIR ఫైల్ అయింది. కేసులో నేరం రుజువైతే 5 ఏళ్లు శిక్ష విధించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో మల్కాజ్ గిరి ఎమ్మెల్యేగా మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచారు.