
నర్సాపూర్, శివ్వంపేట, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాను అభివృద్ధి చేసిన ఘనత దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీకే దక్కుతుందని ఏఐసీసీ ప్రెసిడెంట్మల్లికార్జున ఖర్గే అన్నారు. సోమవారం శివ్వంపేట మండలం చిన్నగొట్టి ముక్కలలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభకు ఆయన చీఫ్ గెస్ట్గా హాజరై మాట్లాడారు. 1980లో మెదక్ జిల్లా ప్రజలు ఇందిరా గాంధీని ఎంపీగా గెలిపించారని గుర్తు చేశారు.
ఇక్కడి నుంచి ఎంపీగా ఉన్నపుడే ఆమె దేశ ప్రధాన మంత్రి అయ్యారని, ఆ సమయంలోనే మెదక్ జిల్లాలో ప్రతిష్టాత్మకమైన బీహెచ్ఈఎల్, డీఆర్డీఓ, ఎయిర్ ఫోర్స్ అకాడమీలు ఏర్పాటుచేసిందన్నారు. తెలంగాణ అభివృద్ధిని కాంక్షించే సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే రాష్ట్ర ప్రజల ఆకాంక్షలన్నింటినీ నెరవేరుస్తామన్నారు. నర్సాపూర్అభ్యర్థి ఆవుల రాజిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఖర్గే కోరారు.
సభ సక్సెస్
ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన విజయభేరి బహిరంగ సభకు నియోజవర్గంలోని అన్నిమండలాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే హాజరు కావడం, సభ సక్సెస్ కావడం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు చిలుముల సుహాసిని రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, శేష సాయి రెడ్డి, కరుణాకర్ రెడ్డి, నవీన్ గుప్తా, పార్టీ మండల అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, మాజీ జడ్పీటీసీ కమలా పూల్సింగ్, నాయకులు రవీందర్ గౌడ్, శ్రీనివాస్, గణేశ్ గౌడ్, లక్ష్మీకాంతం, అశోక్ పాల్గొన్నారు.