- మరో మూడు వారాల్లో ఐలోని మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు
- సుమారు 10 లక్షల మంది వచ్చే అవకాశం
- ఉత్సవ నిర్వహణ కమిటీపై తొలగని సందిగ్ధత
- భయపెడుతున్న శానిటేషన్ సమస్య
హనుమకొండ/వర్ధన్నపేట, వెలుగు : కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా పేరొందిన ఐలోని మల్లన్న జాతరకు సమయం దగ్గర పడుతున్నప్పటికీ ఏర్పాట్లు మాత్రం ముందుకు సాగడం లేదు. మరో మూడు వారాల్లో జాతర ప్రారంభం కానుంది. అయినా జాతరకు అవసరమైన ఏర్పాట్లు, భక్తులకు ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరో వైపు కరోనా కలకలం మొదలు కావడంతో శానిటేషన్ పనులు కూడా చేయాల్సి ఉంది.
కానీ జాతర నిర్వహణకు కీలకమైన ఆలయ కమిటీ ఏర్పాటు ప్రక్రియ మాత్రం ఇంతవరకూ ప్రారంభం కాలేదు. వసతుల కల్పన, సిబ్బంది నియామకంపై ఇప్పటికే మీటింగ్ నిర్వహించాల్సి ఉండగా ఆ సమావేశం కూడా జరగలేదు. దీంతో జాతరకు వచ్చే భక్తులకు కష్టాలు తప్పేలా లేవు.
ఉత్సవ కమిటీపై సందిగ్ధం
ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు సంక్రాంతి నుంచి ప్రారంభమై ఉగాది వరకు కొనసాగుతాయి. జనవరి 13 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానుండగా భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లోనే సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. ఈ సారి మేడారం జాతర కూడా ఉండడంతో ముందస్తుగా మల్లన్న దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగంతో పాటు ఆలయ కమిటీ కూడా కీలకమే. కానీ జాతర సమీపిస్తున్నా మల్లన్న ఆలయ కమిటీపై స్పష్టత రావడం లేదు.
గత జాతర సమయంలోనే అనర్హులకు ట్రస్ట్బోర్డులో అవకాశం కల్పించారంటూ ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించగా ఆ కమిటీని రద్దు చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. చివరకు జాతర ముగిసిన తరువాత ఆలయ కమిటీ ఏర్పాటుకు అక్టోబర్లో మార్గం సుగమమైనా.. ఎన్నికల కోడ్కారణంగా ఆ కమిటీ బాధ్యతలు కూడా తీసుకోలేకపోయింది. అదంతా బీఆర్ఎస్ పాలనలో ఏర్పడిన కమిటీ కాగా.. ఇప్పుడేమో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
వాస్తవానికి ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు ఎండోమెంట్ ఆఫీసర్లు నోటిఫికేషన్ఇచ్చి, ఆసక్తి గల వారి నుంచి అప్లికేషన్లు తీసుకోవాలి. ఇందులో అర్హులను ఎంపిక చేసి దేవాదాయశాఖ కమిషనర్ కమిటీ సభ్యులను ఫైనల్చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వాలి. కానీ ఇంతవరకకూ ఆ ప్రక్రియే ప్రారంభం కాకపోవడం గమనార్హం.
ధరలను నియంత్రించాలి
జాతర టైంలో మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీరు వంటి సౌకర్యాలు సరిగా లేకపోవడంతో భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జాతర సమయంలో టెంపరరీ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నా అవి కూడా సరిపోవడం లేదు. ఇక పూజ సామగ్రి, ఇతర వస్తువుల ధరలను టెండర్దారులు, స్థానిక వ్యాపారులు విపరీతంగా పెంచేస్తుంటారు. కొబ్బరికాయలు టెండర్ నిర్ణయించిన ధర కాకుండా డిమాండ్ను బట్టి రేట్ పెంచి అమ్ముతుంటారు.
గత జాతరలో ఒక్కో కొబ్బరికాయ రూ.50 నుంచి రూ.60 వరకు అమ్మిన సందర్భాలూ దీంతో కొంతమంది భక్తులు ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. ఇక 20 లీటర్ల వాటర్ క్యాన్ రూ. 100కు అమ్ముతున్నారు.
శానిటేషనే ప్రధాన సమస్య
ఐలోని మలన్న దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో శానిటేషన్ ప్రధాన సమస్యగా మారనుంది. ప్రస్తుతం కరోనా కలకలం పెరగడంతో దానిని దృష్టిలో పెట్టుకొని ముందస్తు చర్యలు చేపట్టాల్సి ఉంది. కానీ ఇంతవరకు జాతర సన్నాహక సమావేశమే జరగలేదు. దీంతో లీడర్లు, ఆఫీసర్లు జాతర నిర్వహణపై దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సరిగ్గా మూడు వారాల్లో మల్లన్న బ్రహోత్సవాలు ప్రారంభం కానుండడంతో ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నాం
ఐనవోలు మల్లన్న జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. శానిటేషన్ సమస్యలు తలెత్తకుండా పంచాయతీ, జీడబ్ల్యూఎంసీ సిబ్బంది కలిపి మొత్తం 450 మందికి విధులు అప్పగించేలా ప్లాన్ చేస్తున్నాం. పూజ సామగ్రి, ఇతర వస్తువులు అధిక ధరలకు అమ్మితే ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. జాతరను సక్సెస్ చేసేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగిన చర్యలు చేపడుతాం.
అద్దంకి నాగేశ్వర్రావు, ఐనవోలు ఈవో