
- కొడుకు వివాహేతర సంబంధానికి తండ్రి బలి
- కారుతో గుద్ది, కారం చల్లి గొడ్డళ్లతో నరికి హత్య
- నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లిలో ఘటన
అచ్చంపేట, వెలుగు: కొడుకు వివాహేతర సంబంధం తండ్రి ప్రాణాలు తీసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామానికి చెందిన వీరయ్య(55) చిన్న కొడుకు పరమేశ్, అదే గ్రామానికి చెందిన భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
నెల రోజుల కింద ఆమెను ఏపీలోని గురజాలకు తీసుకెళ్లి సహ జీవనం చేశాడు. వారి ఆచూకీ తెలుసుకున్న కుటుంబసభ్యులు అక్కడికి వెళ్లి యువకుడిని చితకబాది, సదరు మహిళను తీసుకువచ్చారు. ఈ విషయంలో ఆగ్రహంగా ఉన్న మహిళ బంధువులు, మంగళవారం వీరయ్య, తన పెద్ద కొడుకు వెంకటేశ్తో కలిసి అచ్చంపేట నుంచి నడింపల్లికి బైక్ పై వెళ్తున్న విషయాన్ని గుర్తించారు.
ఇటుక బట్టీల వద్ద మాటు వేసి కారుతో బైక్ను ఢీకొట్టారు. ఆ తరువాత వారి కళ్లల్లో కారం చల్లి సుత్తి, గొడ్డలితో దాడి చేశారు. వీరయ్య అక్కడికక్కడే చనిపోగా, స్వల్ప గాయాలతో వెంకటేశ్ తప్పించుకున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు హైదరాబాద్–అచ్చంపేట ప్రధాన రహదారిపైనే డెడ్బాడీని ఉంచి రాస్తారోకో చేశారు. అచ్చంపేట డీఎస్పీ పల్లె శ్రీనివాసులు, సీఐ రవీందర్ ఘటనా స్థలానికి చేరుకొని హంతకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.