- రాజస్థాన్ నుంచి ఆన్లైన్ ద్వారా యువతులతో వల
- రిజిస్ట్రేషన్ ఫీజుల పేరుతో డబ్బు వసూలు
- నిందితుడిని అరెస్ట్ చేసిన సీఐడీ
హైదరాబాద్, వెలుగు: ఫిమేల్ ఎస్కార్ట్ సర్వీస్ (సెక్స్ వర్కర్ల) పేరిట మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టయింది. రాజస్థాన్ కేంద్రంగా ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న నరేశ్ పాటిదార్ అనే వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు. స్థానిక కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్ తరలించారు. శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. వివరాలను సీఐడీ చీఫ్ శిఖా గోయల్ ఓ ప్రకటనలో వెల్లడించారు. రాజస్థాన్ దుంగర్పూర్ ప్రాంతానికి చెందిన నరేశ్ పాటిదార్ www.in.sduko.com వెబ్సైట్ ద్వారా మోసాలకు ప్లాన్ చేశాడు. ఫిమేల్ ఎస్కార్ట్ సర్వీసెస్ పేరుతో16 ఏండ్ల యువతులతో సర్వీస్ అందిస్తామని ప్రకటనలు ఇచ్చాడు. కొందరి నుంచి రిజిస్ట్రేషన్ ఫీజుల పేరుతో డబ్బు వసూలు చేసేవాడు. కాల్స్, వీడియో కాల్స్ ఇలా ఒక్కో విధానానికి ఒక్కో రేటు నిర్ణయించాడు.
సైకాప్స్ సెర్చింగ్లో చిక్కాడు
సర్వీసెస్ కోసం సంప్రదించే వారికి అందమైన అమ్మాయిల ఫొటోలు, వీడియోలు పంపించేవాడు. ట్రాప్ లో పడిన వారి నుంచి అడ్వాన్స్ డబ్బు సేకరించేవాడు. ఆ తరువాత ఫోన్ కాల్స్కి స్పందించకుండా మోసం చేసేవాడు. ఇలా నరేశ్ పాటిదార్ చేసిన మోసాలతో దేశ వ్యాప్తంగా 16 కేసులు నమోదయ్యాయి. ఆన్లైన్లో అందిన ఫిర్యాదు మేరకు ‘సైకాప్స్’ అనే టెక్నాలజీని ఉపయోగించి సీఐడీ పోలీసులు దర్యాప్తు చేశారు. ఆన్లైన్లో సెర్చ్ చేస్తుండగా నిందితుడి జాడను రాజస్థాన్లో గుర్తించారు. సీఐడీ సైబర్ క్రైమ్స్ డీఎస్పీ ఎన్ అశోక్కుమార్ బృందం ఇటీవల రాజస్థాన్ వెళ్లింది. ఐపీ అడ్రస్ ఆధారంగా దుంగర్పూర్లో నిందితుడిని అదుపులోకి తీసుకుంది. స్థానిక కోర్టులో హాజరు పర్చి, ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్ తరలించింది. ముఠాకు సంబంధించిన మరింత మందిని పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.