ఒకే ఆస్పత్రిలో భర్త మృతి..భార్యకు డెలివరీ

ఒకే ఆస్పత్రిలో భర్త మృతి..భార్యకు డెలివరీ
  • కర్నూల్ దవాఖానలో హృద‌య‌విదార‌క‌ ఘ‌ట‌న‌

శాంతినగర్, వెలుగు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ మృతి చెందగా..తర్వాత గంట సేపటికి అదే ఆస్పత్రిలో అతని భార్యకు డెలివరీ అయ్యింది. ఈ హృద‌య‌విదార‌క‌ ఘ‌ట‌న‌ కర్నూల్ గవర్నమెంట్ దవాఖానలో బుధవారం చోటు చేసుకున్నది. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం తుమ్మలపల్లె గ్రామానికి చెందిన శివ(28) సమీపంలోని పెట్రోల్ పంపులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

 అయితే, అతని భార్య లక్ష్మి ప్రెగ్నెంట్ కావడంతో  డెలివరీ కోసం ఇటీవల పుట్టింటికి వెళ్లింది. మంగళవారం రాత్రి రాజోలి వెళ్తుతుండగా బైక్‌ స్కిడ్‌ అయి శివ పడిపోయాడు. అతని తలకు బలమైన గాయం తగిలి తీవ్ర రక్తస్రావం జరిగింది. గమనించిన స్థానికులు అంబులెన్స్ ను పిలిపించి శివను కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదే రోజు శివ భార్య లక్ష్మికి కూడా పురిటి నొప్పులు వచ్చాయి. లక్షి కుటుంబసభ్యులు కూడా  ఆమెను అదే ఆస్పత్రికి తీసుకెళ్లారు. భర్త ట్రీట్మెంట్ పొందుతూ రాత్రి ఒంటిగంటకు మృతి చెందాడు. భర్త మృతి చెందిన గంట తర్వాత భార్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. మనుమడు పుట్టాడని సంతోషించాలో.. శివ చనిపోయాడని ఏడవాలో తెలీక అతని తల్లిదండ్రులు, భార్య లక్ష్మీ, ఆమె కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.