![కార్పొరేషన్తో భూముల ధరలకు రెక్కలు](https://static.v6velugu.com/uploads/2025/02/realtors-rejoice-common-people-suffer_jZ3bHaKcC7.jpg)
- మంచిర్యాలలో భారీగా పెరుగుతున్న ల్యాండ్ రేట్లు
- వేంపల్లి నుంచి గుడిపేట దాకా హైక్ చేస్తున్న రియల్టర్లు
- విలీన గ్రామాల్లో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న వెంచర్లు
- ప్రజలపై రిజిస్ట్రేషన్ చార్జీలు, టాక్స్ల భారం
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల గ్రేడ్1 మున్సిపాలిటీ కార్పొరేషన్గా అప్గ్రేడ్ కావడంతో ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. కార్పొరేషన్ పేరు చెప్పి రియల్టర్లు రేట్లు హైక్ చేస్తున్నారు. శివారు ఏరియాల్లో మొన్నటిదాకా గజం రూ.ఐదారు వేలు పలికిన భూములకు ఇప్పుడు రూ.10 వేలు చెప్తున్నారు. మంచిర్యాలలోని ప్రైమ్ లొకేషన్స్లో గజం రూ.15 వేల దాక ఉండగా మరో రూ.5 వేలు పెంచారు.
ఇప్పటికే హైటెక్సిటీ, గ్రీన్సిటీ వంటి చోట్ల రూ.20 వేల నుంచి రూ.30వేలు పలుకుతోంది. దీంతో జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లోని లే అవుట్లలో సామాన్యులు గుంట జాగ కూడా కొనే పరిస్థితి లేదు. నాన్లే అవుట్లలో ధరలు అందుబాటులో ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లు కావడం లేదని, కార్పొరేషన్లో ఇంటి పర్మిషన్లు వస్తాయో లేదోనని వెనక్కి తగ్గుతున్నారు.
వేంపల్లి, ముల్కల్ల, గుడిపేట ప్రాతాల్లో..
మంచిర్యాల కార్పొరేషన్లో పక్కనున్న నస్పూర్మున్సిపాలిటీతో పాటు హాజీపూర్ మండలంలోని వేంపల్లి, ముల్కల్ల, పోచంపాడ్, కొత్తపల్లి, గుడిపేట, నర్సింగాపూర్, నంనూర్, చందనాపూర్ గ్రామాలను విలీనం చేశారు. దీంతో శ్రీరాంపూర్ నుంచి గుడిపేట దాక దాదాపు 150 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో కార్పొరేషన్ ఏర్పాటైంది. దీంతో ఈ ప్రాంతాల్లో భూముల ధరలను భారీగా పెంచుతున్నారు. నస్పూర్లో కలెక్టరేట్ చుట్టుపక్కల భూములకు విపరీతంగా డిమాండ్ ఉన్నప్పటికీ రేట్లు ఏనాడో చుక్కలనంటాయి.
ఈ కారణంగా అందరి దృష్టి వేంపల్లి, ముల్కల్ల, గుడిపేట వైపు మళ్లింది. వేంపల్లి, ముల్కల్ల శివార్లలో ఇండస్ట్రియల్ హబ్, ఐటీ పార్క్ఏర్పాటు కానున్నాయి. వీటి కోసం సుమారు 270 ఎకరాల అసైన్డ్ భూములను సేకరిస్తున్నారు. గుడిపేటలో ఇప్పటికే 13వ పోలీస్ బెటాలియన్ ఉండగా, మెడికల్ కాలేజీ, కేంద్రీయ విద్యాలయం నిర్మాణంలో ఉన్నాయి.
ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ రానుంది. అలాగే నేషనల్హైవే 63లో భాగంగా గోదావరి తీరం నుంచి గ్రీన్ఫీల్డ్హైవే, ముల్కల్ల నుంచి క్యాతన్పల్లి వరకు 200 ఫీట్ల బైపాస్రోడ్డు, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలను కలుపుతూ గోదావరిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రపోజల్స్ ప్రభుత్వానికి చేరాయి. రానున్న రోజుల్లో ఈ ప్రాంతం బాగా డెవలప్మెంట్అయ్యే చాన్స్ఉండడంతో ఇటువైపు భూములకు డిమాండ్
ఒక్కసారిగా పెరిగింది.
రిజిస్ట్రేషన్ చార్జీలు, టాక్స్ల భారం
మంచిర్యాల కార్పొషన్లో నస్పూర్మున్సిపాలిటీ సహా సమీప గ్రామాలను విలీనం చేయడంతో భూముల రేట్లు పెరుగుతున్నాయని రియల్టర్లు ఆనందిస్తున్నారు. అయితే అదే స్థాయిలో రిజిస్ట్రేషన్చార్జీలు, టాక్స్ భారం పెరుగుతోందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంటి పర్మిషన్ఫీజులు, ప్రాపర్టీ టాక్స్, నల్లా బిల్లులు, ఇండ్లరెంట్లు డబుల్అయ్యే చాన్సుందని వాపోతున్నారు.
విచ్చలవిడిగా ఇల్లీగల్ వెంచర్లు
పాత మంచిర్యాల, వేంపల్లి, ముల్కల్ల, గుడిపేట ప్రాంతాల్లో విచ్చలవిడిగా రియల్ ఎస్టేట్వెంచర్లు వెలుస్తున్నాయి. ఎన్హెచ్63 వెంట అడుగడుగునా ఇల్లీగల్ వెంచర్లు కనిపిస్తున్నాయి. వ్యవసాయ భూములకు నాలా కన్వర్షన్ చేసి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో దొంగచాటుగా రిజిస్ట్రేషన్లు చేపిస్తున్నారు. గుడిపేటలో మెడికల్ కాలేజీని చూపుతూ దాదాపు 20 ఎకరాల్లో డాక్టర్స్సిటీ పేరిట, ఆ పక్కనే మామిడి తోటల వెనుక మరో 30 ఎకరాల్లో ఇల్లీగల్ వెంచర్ ఏర్పాటు చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వెళ్లే దారిలో 10 ఎకరాల్లో మరో రెండు వెంచర్లువెలిశాయి.
చందనాపూర్కెనాల్ పక్కనుంచి రెండు కిలోమీటర్లు వెళ్తే భువి ఇన్ఫ్రా పేరిట 30 ఎకరాల్లో ఇంకో వెంచర్ ఉంది. ముల్కల్ల నుంచి క్యాతన్పల్లి వరకు ప్రతిపాదిత 200 ఫీట్ల బైపాస్ రోడ్డులో లక్ష్మీ మెగా టౌన్షిప్పేరిట 70 ఎకరాల్లో ఒక వెంచర్ఉండగా, వేంపల్లి లా కాలేజీ వెనుకాల దాదాపు 150 ఎకరాల్లో ఇల్లీగల్వెంచర్లు ఏర్పాటు చేశారు. తిమ్మాపూర్ నుంచి క్యాతన్పల్లి జంక్షన్వరకు వందల ఎకరాల్లో రియల్ దందా జోరుగా సాగుతోంది.