
- ఐదు నెలల్లో 14 దొంగతనాలు
- రూ.16 లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం
మంచిర్యాల, వెలుగు : వివిధ ప్రాంతాల్లో ఐదు నెలల్లోనే 14 చోరీలకు పాల్పడిన ఏడుగురు వ్యక్తులను మంచిర్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.16 లక్షల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ శనివారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... నస్పూర్ ప్రశాంత్నగర్కు చెందిన పాగిడి కార్తీక్, మంచిర్యాల గాంధీనగర్కు చెందిన తాటికొండ స్వామి శరణ్, బెల్లంపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన పప్పుల రాహుల్, నస్పూర్ సుందరయ్య కాలనీకి చెందిన గన్నారం మధుకర్
కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం రేగులగూడెంకు చెందిన కుర్సెంగ ఈశ్వర్, తిర్యానికి చెందిన మడావి రఘు, కన్నెపల్లికి చెందిన వెడ్మ ప్రవీణ్ ముఠాగా ఏర్పడి చోరీలు చేసేందుకు ప్లాన్ చేశారు. వీరంతా కలిసి ఐదు నెలల వ్యవధిలోనే మంచిర్యాలలో మారుతీనగర్, జాఫర్నగర్, ఆర్ఆర్ కాలనీ, అభినవకాలనీ, సాయి హనుమాన్నగర్, హాజీపూర్ మండలం గుడిపేట, వేంపల్లి ఎస్బీఆర్ కాలనీ, సాయికుటీర్ రైస్ మిల్లు వద్ద, బెల్లంపల్లి స్టేషన్ రోడ్డుకాలనీ, గద్దెరాగడిలోని అమ్మగార్డెన్స్ ఏరియా, మందమర్రి మండలం బురదగూడెంలోని పలు ఇండ్లలో చోరీలు చేశారు.
వరుస చోరీలను సీరియస్గా తీసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు స్పెషల్ టీమ్ను ఏర్పాటు చేశారు. చోరీలు చేసిన వ్యక్తులు వారి స్వగ్రామాల్లో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు శనివారం దాడి చేసి ఏడుగురిని పట్టుకొని కోర్టులో హాజరుపరిచారు. నిందితులను పట్టుకున్న సిబ్బందికి సీపీ శ్రీనివాస్ నగదు రివార్డులు అందజేశారు.