
మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ (సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(ఐడీవోసీ)ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. కలెక్టరేట్ శిలాఫలకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. నూతన కలెక్టరేట్లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో కేసీఆర్ పాల్గొన్నారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
రూ.1,748 కోట్లతో చెన్నూర్, పర్ధాన్పల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు, రూ.510 కోట్లతో మెడికల్ కాలేజీ, రూ.500 కోట్లతో మందమర్రి దగ్గర ఏర్పాటు చేయనున్న ఆయిల్ పాం ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు, గోదావరిపై రూ.164 కోట్లతో నిర్మించే మంచిర్యాల-అంతర్గాం బ్రిడ్జికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
కలెక్టరేట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, జోగు రామన్న, రేఖా నాయక్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.