
రంగారెడ్డి జిల్లా: సినీ నటుడు మంచు మనోజ్ కారు చోరీకి గురైంది. ఇంట్లో పార్కింగ్ చేసిన కారును దొంగలు అపహరించుకెళ్లారు. కారు స్టార్ట్ చేసిన శబ్దాన్ని విని డ్రైవర్ వెంబడించినా దొంగలు చిక్కకుండా కారుతో ఉడాయించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మనోజ్ కారు చోరీపై అతని డ్రైవర్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసుల కథనం ప్రకారం గండిపేట మండలం నార్సింగిలోని ముప్పా విల్లాస్లోని 13వ నెంబర్ విల్లా ముందు ఏప్రిల్ ఒకటో తేదీన మంచు మనోజ్కు చెందిన కారును ఇంటి ముందు నిలిపారు. రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లో మనోజ్ డ్రైవర్ భోజనం చేస్తుండగా.. కారు స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది. అనుమానంతో బయటికి వచ్చిన మనోజ్ డ్రైవర్ కొలుసు సాంబశివరావు బిగ్గరగా కేకలు వేస్తూ కారుని ఆపడానికి యత్నించాడు.
Also Read:-తెలంగాణ అతిథ్యానికి వన్నె తెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు
కారుని ఆపకుండా అతివేగంతో ఆ దొంగలు ఉడాయించారు. దాంతో మనోజ్ డ్రైవర్ సాంబశివరావు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీకి గురైన కారు వెళ్లిన మార్గాన్ని పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి దర్యాప్తు చేశారు. రాజేంద్రనగర్ సమీపంలో దొంగలు వదిలి వెళ్ళిన మనోజ్ కారు పోలీసులకు లభ్యమైంది. కారును స్వాధీనం చేసుకుని న్యాయస్థానంలో డిపాజిట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
కారును అపహరించింది దొంగలా లేక కుటుంబ కలహాల కారణంగా ఎవరైనా కుటుంబ సభ్యులే ఎత్తుకెళ్లారా అనేది దర్యాప్తులో తేలనున్నట్లు పోలీసులు తెలిపారు. అన్ని కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. ఈ మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.