ప్రతీ నేతా కాబోయే ప్రధానే... రాహుల్​కు దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది: మనీశ్ తివారీ

ప్రతీ నేతా కాబోయే ప్రధానే... రాహుల్​కు దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది: మనీశ్ తివారీ

న్యూఢిల్లీ: ప్రతి ప్రతిపక్ష నాయకుడూ కాబోయే ప్రధానమంత్రేనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మనీశ్ తివారీ అన్నారు. ప్రజల సమస్యలను లేవనెత్తుతూ, మణిపూర్ లాంటి ప్రాంతాల్లో పర్యటించిన రాహుల్ గాంధీకి దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని చెప్పారు. జూన్ చివరలో రాహుల్​ గాంధీ లోక్‌‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. కాగా, రాహుల్​గాంధీని కాబోయే ప్రధానిగా చూస్తున్నారా అని బుధవారం మనీశ్​ తివారీని మీడియా ప్రశ్నించగా.. "ప్రతి ప్రతిపక్ష నాయకుడు వెయిటింగ్​లో ఉన్న ప్రధానమంత్రే.

రాహుల్​ గాంధీ ప్రసంగాలకు దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. ప్రజల హృదయాలు, మనస్సులకు దగ్గరగా ఉండే సమస్యలపై ఆయన పోరాడుతున్నారు" అని తివారీ అన్నారు. ఇందుకు గత ఏడాది మణిపూర్ లాంటి ప్రదేశాలలో ఆయన చేసిన పర్యటనలే నిదర్శనమని తివారీ పేర్కొన్నారు.