
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ కలెక్టరేట్తోపాటు జిల్లా కేంద్రంలోని ఆఫీసుల్లో చాలామంది ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. ఉదయం 10 గంటల వరకు విధులకు హాజరు కావాల్సి ఉండగా.. 11 గంటలు దాటినా చాలామంది ఆఫీసులకు చేరుకోవడం లేదు. బుధవారం ‘వీ6 వెలుగు’ బుధవారం కలెక్టరేట్ లోని పలు డిపార్ట్మెంట్లను సందర్శించగా.. ఉద్యోగులు లేక సెక్షన్లు బోసిపోయి కనిపించాయి. చాలా మంది అప్పుడప్పుడే రావడం కనిపించింది.
వివిధ శాఖల హెచ్ఓడీలు చాలామంది హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తుండడంతో మధ్యాహ్నం 12 గంటలకుగానీ చేరుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కింది స్థాయి ఉద్యోగులు కూడా ఆలస్యంగా వస్తున్నారని తెలిసింది. ఇంత లేటుగా వచ్చినా సాయంత్రం 5 గంటలకు ఒక్క నిమిషం దాటకుండానే వెళ్లిపోతున్నారన్న విమర్శలున్నాయి.