- సాధారణ బండ్లే మేలంటున్న కస్టమర్లు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ కార్లు వాడుతున్న వారిలో మెజారిటీ కస్టమర్లు సంతోషంగా లేరని తాజా సర్వే ఒకటి వెల్లడించింది. పార్క్ ప్లస్ సంస్థ ఇటీవల ఢిల్లీ, ముంబై, బెంగళూరులోని 500 మంది కార్ల యజమానులతో నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయింది. ఎలక్ట్రిక్ కార్లతో తాము చాలా రకాలుగా ఆందోళన చెందుతున్నామని తెలిపారు. వీరిలో 51 శాతం మంది రెస్పాండెంట్లు ఇంటర్నల్కంబశ్చన్ ఇంజన్(ఐసీఈ) వాహనాలకు తిరిగి రావాలని కోరుకుంటున్నారు. మైలేజీ కంటే చార్జింగ్ గురించి ఎక్కువ ఆందోళన పడుతున్నామని వీరంతా తెలిపారు.
తమ ఇండ్లకు సమీపంలో అనువైన చార్జింగ్ స్టేషన్లను కనుగొనడంలో ఇబ్బందిపడుతున్నామని 88 శాతం ఈవీ యజమానులు పేర్కొన్నారు. భారతదేశంలో 20 వేలకుపైగా ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఉన్నప్పటికీ, చాలా మంది యజమానులకు వాటి గురించి తెలియడం లేదు. ఎలక్ట్రిక్ కార్ల నిర్వహణ ఖర్చులు కూడా ఒక ముఖ్యమైన సవాలుగా మారింది. 73 శాతం మంది తమ ఎలక్ట్రిక్ కార్లను రిపేర్ చేయించడం కష్టమని, లోకల్ మెకానిక్లు చిన్న సమస్యలను కూడా పరిష్కరించలేకపోతున్నారని వెల్లడించారు.