
భద్రాచలం, వెలుగు : చత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులకు చెందిన భారీ డంప్ను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. సుక్మా జిల్లా చింతగుఫా పోలీస్స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన మెట్టగూడెం బేస్ క్యాంపునకు చెందిన 203 వాహినీ కోబ్రా, 131 బెటాలియన్ సీఆర్పీఎఫ్, జిల్లా పోలీసులు శనివారం గుండ రాజుగూడ గ్రామ సమీపంలోని చింతవాగు నది వద్ద ఆపరేషన్ నిర్వహించారు.
ఈ ప్రాంతంలో మావోయిస్టులు దాచిన డంప్ను గుర్తించి బయటకు తీశారు. మావోయిస్టులకు చెందిన ఆయుధాలతో పాటు కీలక డాక్యుమెంట్లు దొరికాయి. వాటిలో ఆయుధాలు సమకూర్చుకోవడం, దళాల్లోకి రిక్రూట్మెంట్, ఆపరేషన్ కగార్పై వ్యూహాత్మక దాడులు, ఇన్ఫార్మర్ల ఏరివేత తదితర అంశాలతో కూడిన వివరాలు ఉన్నాయి. ఈ డాక్యుమెంట్లను ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు.