
- ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
భద్రాచలం, వెలుగు: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు ఇన్ఫార్మర్ల పేరిట ఇద్దరు ఆదివాసీలను హత్య చేశారు. బీజాపూర్ జిల్లా తెర్రం పోలీస్స్టేషన్ పరిధిలోని బుడిగిచేరు గ్రామానికి చెందిన కారం రాజు(32), మాడవి మున్నా(27)ను సోమవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా సాయుధులైన 12 మంది మావోయిస్టులు తుపాకులతో బెదిరించి సమీపఅడవుల్లోకి తీసుకెళ్లారు. అక్కడ ప్రజాకోర్టు నిర్వహించి వారిని కత్తులతో పొడిచి చంపారు.
అనంతరం వారి డెడ్బాడీలను గ్రామ సమీపంలో పడేసి లేఖ వదిలి వెళ్లారు. దళాల కదలికలను పోలీసులకు చెబుతూ ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. ఇన్ఫార్మర్లకు ఇలాంటి గతే పడుతుందని ఆ లేఖలో హెచ్చరించారు. కాగా, బలగాలను పంపించి డెడ్ బాడీలను ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు బీజాపూర్ ఏఎస్పీ చంద్రకాంత్ గవర్నా తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
మందుపాతర పేలి జవాన్లకు గాయాలు..
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా కిరండోల్ పోలీస్స్టేషన్ పరిధిలోని పురంగేల్ అటవీ ప్రాంతంలో మంగళవారం మందుపాతర పేలి ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి.
సీఆర్పీఎఫ్ 231 బెటాలియన్కు చెందిన జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తుండగా, మందుపాతర పేలింది. ఈ ఘటనలో ప్రమోద్కుమార్, విజయ్కుమార్ గాయపడ్డారు. ప్రమాద్కుమార్ కాలికి తీవ్ర గాయం కావడంతో ఆపరేషన్ చేశారు. విజయ్కుమార్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రాయ్పూర్కు హెలీకాప్టర్లో తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నట్లు బస్తర్ ఐజీ సుందర్రాజ్ పి తెలిపారు.