ఇన్​ఫార్మర్​ పేరిట మహిళ హత్య

ఇన్​ఫార్మర్​ పేరిట మహిళ హత్య
  • భద్రాద్రి జిల్లా చెన్నాపురంలో చంపేసిన మావోయిస్టులు
  • మృతురాలు మావోయిస్టు మాజీ కమాండర్ నీల్సో అలియాస్​ రాధ
  • ఆమె విప్లవ ద్రోహి: ఏవోబీ జోనల్​ కమిటీ కార్యదర్శి గణేశ్ 
  • తొమ్మిది రోజుల్లో ముగ్గురి హత్య

భద్రాచలం, వెలుగు: ఇన్​ఫార్మర్​ పేరిట ఓ మహిళను మావోయిస్టులు హత్య చేశారు. మృతురాలిని మావోయిస్టు పార్టీ మాజీ మహిళా కమాండర్​ నీల్సో అలియాస్​ రాధ (25)గా ప్రకటించారు. ఏవోబీ(ఆంధ్రా, ఒడిశా బోర్డర్​)లో జోన్​ మిలటరీ ఇన్​స్ట్రక్టర్​గా, నాయకత్వ రక్షణ దళ కమాండర్​గా పనిచేస్తున్న ఆమెపై అనుమానం వచ్చి మూడు నెలల కిందట్నే పార్టీ సస్పెండ్​ చేసింది.  పార్టీ ఏవోబీ జోనల్​ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్​ గణేశ్​ ఆధీనంలో ఉంచింది. విచారణ అనంతరం విప్లవ ద్రోహిగా పేర్కొంటూ భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురంలో బుధవారం మావోయిస్టులు హత్య చేశారు. ఈ ఘటనపై గణేశ్​ ఓ ప్రకటన విడుదల చేశారు. నీల్సో విప్లవ ద్రోహి అని, అందుకే చంపేశామని అందులో పేర్కొన్నారు. 

ల్యాబ్​ టెక్నీషియన్ కోర్సు చేసి.. 

హైదరాబాద్​లోని బాలాజీనగర్​కు చెందిన బంటి రాధ ఇంటర్ తర్వాత డిప్లమా ఇన్​ మెడికల్​ ల్యాబోరేటరీ​ టెక్నాలజీ (డీఎంఎల్​టీ) చదివింది. 2018లో మావోయిస్టు పార్టీలో చేరింది. పలువురు కేంద్ర కమిటీ సభ్యులకు ఆమె వైద్యం అందించేది. 2018లోనే రాధ తల్లి.. తన కుమార్తె కనిపించడం లేదంటూ ఆంధ్రప్రదేశ్​లోని పెద్దబయలు పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఎన్​ఐఏ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నది. కాగా మూడు నెలల కిందట మావోయిస్టు పార్టీ నీల్సో అలియాస్​ రాధపై నిఘా పెట్టింది. పోలీసు ఇన్​ఫార్మర్​ పేరుతో బుధవారం హత్య చేశారు. 

ఏవోబీ జోనల్​ కమిటీ కార్యదర్శి గణేశ్​ విడుదల చేసిన లేఖలో..  ‘‘ఆంధ్రా, చత్తీస్​గఢ్​, తెలంగాణ రాష్ట్రాల ఇంటెలిజెన్స్ పోలీసులు రాధను ఇన్​ఫార్మర్​గా మార్చుకున్నారు. తొలుత ఆమె సోదరుడు సూర్యంను మచ్చిక చేసుకుని ఉద్యోగం ఇచ్చి జీతం, విలాసవంతమైన సౌకర్యాలు కల్పించారు. మరో ముగ్గురితో కలిపి ఒక కమిటీ ఏర్పాటు చేసి మావోయిస్టు పార్టీ సమాచారాన్ని సేకరిస్తున్నారు. రాధ ఫోన్​ నంబర్​ను తెలుసుకుని ఆమె స్నేహితురాలి ద్వారా పార్టీ నుంచి బయటకు రప్పించేందుకు ఇంటెలిజన్స్ వర్గాలు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. అవి ఫలించలేదు. కానీ ఆమె సోదరుడు సూర్యంతో ఫోన్​ చేయించి.. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు, ఘర్షణలు, తల్లి అనారోగ్యం గురించి చెప్పించి నెమ్మదిగా ఒప్పించారు. 

పార్టీలోనే ఉంటూ అగ్రనేతల వివరాలు అందిస్తే కష్టాలు తీరుతాయని ఇంటెలిజెన్స్ వర్గాలు ద్వారా రాధను ఒప్పించి ఇన్​ఫార్మర్​గా మార్చుకున్నారు” అని ఉంది. ఇటీవల ఒడిశా, తెలంగాణ, చత్తీస్​గఢ్​ బార్డర్లలో మావోయిస్టు పార్టీకి తగులుతున్న ఎదురుదెబ్బలకు ప్రధాన కారణం కోవర్టులు, ఇన్​ఫార్మర్లు, పోలీసు ఏజెంట్లేనని తమ పార్టీ గుర్తించిందని గణేశ్​ తన లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నీల్సో అలియాస్​ రాధపై  విచారణ జరిపి అంతమొందించినట్లు తెలిపారు. 

తొమ్మిది రోజుల్లో ముగ్గురి హత్య

చత్తీస్​గఢ్​ దండకారణ్యం, తెలంగాణ, ఏవోబీలో మావోయిస్టు పార్టీ తొమ్మిది రోజుల్లో ఇన్​ఫార్మర్ల పేరిట ముగ్గురిని హత్య చేయడం కలకలం రేపుతున్నది. ఈ ఏడాది 120 మందికి పైగా మావోయిస్టులు ఎన్​కౌంటర్లలో చనిపోయారు. పార్టీకి తగులుతున్న వరుస ఎదురుదెబ్బలకు  కారణం కోవర్టులు, ఇన్​ఫార్మర్లేనని మావోయిస్టు అగ్రనాయకత్వం భావిస్తున్నది. ఇదే క్రమంలో..  పశ్చిమ బస్తర్​ డివిజన్​ కమిటీ ఇన్​చార్జ్​ కుర్సం మనీష్​ను ఈ నెల 13న మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించి, ఇన్​ఫార్మర్​గా పేర్కొంటూ చంపేశారు. 

ఆ తర్వాత మావోయిస్టు మాస్టర్​ మైండ్​ హిడ్మా స్వగ్రామం పువ్వర్తిలోనూ సోయం శంకర్​ అనే పదో తరగతి విద్యార్థి సైతం హత్యకు గురయ్యారు. తాజాగా మాజీ మహిళా కమాండర్​ నీల్సో అలియాస్​ రాధను కూడా ఇన్​ఫార్మరంటూ హత్య చేయడం కలకలం రేపుతున్నది. ఈ పరిణామాలతో కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అలెర్ట్ అయ్యాయి. లొంగిపోయిన మావోయిస్టులు, పోలీస్​ హిట్​ లిస్టులో ఉన్న వారిని జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు.