![ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి .. ప్రభుత్వానికి టీఎన్జీవో విజ్ఞప్తి](https://static.v6velugu.com/uploads/2025/02/maram-jagadishwar-mujeeb-demand-immediate-resolution-of-employees-issues_BlqHj7V6sy.jpg)
హైదరాబాద్, వెలుగు: ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ముజీబ్ డిమాండ్ చేశారు. పెండింగ్ డీఏలు, పీఆర్సీ, ఈహెచ్ ఎస్, 317 జీవో, పెండింగ్ మెడికల్ బిల్స్, రిటైర్ మెంట్ బెనిఫిట్స్, సీపీఎస్ రద్దు ఇలా చాలా సమస్యలు ఉన్నాయని గుర్తుచేశారు. బుధవారం నాంపల్లి టీఎన్జీవో భవన్లో సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. దీనికి కేంద్ర సంఘం నేతలతో పాటు 33 జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు అటెండ్ అయ్యారు.
అనంతరం కేంద్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ముజీబ్ మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల జేఏసీతో సీఎం రేవంత్ రెడ్డి అక్టోబర్లో నిర్వహించిన మీటింగ్ తర్వాత సమస్యలు చర్చించటానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారని జగదీశ్వర్ గుర్తు చేశారు. అయితే ఇంత వరకు ఉద్యోగుల జేఏసీతో కేబినెట్ సబ్ కమిటీ ఒక్క సమావేశం కూడా నిర్వహించకపోవడం బాధాకరమన్నారు.