
- సెబీ మాజీ చీఫ్ మాధవిపై ఎఫ్ఐఆర్..
- స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ చేశారని ఆరోపణ
- దర్యాప్తు జరపాలని ఏసీబీకి కోర్టు ఆదేశం
ముంబై: రెగ్యులేషన్స్ ఉల్లంఘించారని, స్టాక్ మార్కెట్ ఫ్రాడ్కు పాల్పడ్డారనే ఆరోపణలపై సెబీ మాజీ చైర్పర్సన్ మాధవి పూరి బుచ్పై యాంటి కరప్షన్ బ్యూరో (ఏసీబీ) దర్యాప్తు ప్రారంభించింది. ఆమెతో పాటు మరో ఐదుగురు అధికారులపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ‘రెగ్యులేషన్స్ ఉల్లంఘించినట్టు క్లియర్గా ఆధారాలు ఉన్నాయి.
పారదర్శకంగా దర్యాప్తు జరపాలి’ అని స్పెషల్ ఏసీబీ కోర్ట్ జడ్జ్ శశికాంత్ ఏక్నాథరావు బంగర్ తీర్పిచ్చారు. దర్యాప్తు అవసరమని అన్నారు. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, సెబీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో సీఆర్పీసీ చట్టం కింద కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మాధవి పూరి బుచ్తో పాటు బీఎస్ఈ ఎండీ సుందరరమణ్ రామమూర్తి, ఈ సంస్థ చైర్మన్ ప్రమోద్ అగర్వాల్, ముగ్గురు సెబీ హోల్టైమ్ డైరెక్టర్లు అశ్విని భాటియా, అనంత్ నారాయణ్ జీ, కమ్లేశ్ చంద్ర వర్ష్నేపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని కోర్టు తీర్పిచ్చింది.
దర్యాప్తు జాగ్రత్తగా గమనిస్తామని, ఇంకో 30 రోజుల్లో రిపోర్ట్ సబ్మిట్ చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఛాలెంజ్ చేయడానికి అవసరమైన, న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని సెబీ పేర్కొంది. ఫైనాన్షియల్ ఫ్రాడ్కు పాల్పడ్డారని, రూల్స్ను ఉల్లంఘించారని మాధవి పూరి బుచ్పై మీడియా రిపోర్టర్ సాపన్ శ్రీవాస్తవ (47) కోర్టులో కేసు ఫైల్ చేశారు.
సెబీ చట్టం, రూల్స్, రెగ్యులేషన్స్ను ఫాలో కాని ఓ కంపెనీ లిస్టింగ్ని వీరు అనుమతిచ్చారని ఆరోపించారు. సెబీ అధికారులు తమ పని చేయడంలో ఫెయిలయ్యారని, మార్కెట్ మానిప్యులేషన్ జరుగుతుంటే చూస్తు ఊరుకున్నారని అన్నారు. కాగా, అదానీ గ్రూప్లో ఇన్వెస్ట్ చేసిన రెండు ఆఫ్షోర్ ఫండ్స్లో మాధవి, ఆమె భర్త ధవల్ బుచ్కు పెట్టుబడులు ఉన్నాయని హిండెన్బర్గ్ కిందటేడాది ఆగస్టులో రిపోర్ట్ విడుదల చేసిన విషయం తెలిసిందే.