ఎలివేటెడ్ కారిడార్ భూ సేకరణకు మార్కింగ్ షురూ

ఎలివేటెడ్ కారిడార్ భూ సేకరణకు మార్కింగ్ షురూ
  •     జేబీఎస్​ నుంచి శామీర్​పేట వరకు 300 ప్రైవేట్​ నిర్మాణాలు
  •     ప్యారడైజ్ నుంచి బోయిన్​ పల్లి వరకు 200 ప్రైవేట్​ స్థలాల సేకరణకు నిర్ణయం
  •     నష్టపరిహారం కంటే టీడీఆర్​ వర్తింపుకే అధికారులు మొగ్గు!
  •     నిధుల సేకరణపై హెచ్​ఎండీఏ కసరత్తు

హైదరాబాద్, వెలుగు : ఎలివేటెడ్ ​కారిడార్ పనులు ఊపందుకున్నాయి. భూసేకరణపై హెచ్​ఎండీఏ అధికారులు ఫోకస్​పెట్టారు. పలు ప్రాంతాల్లో సేకరించాల్సిన ప్రైవేట్ ఆస్తులను మార్కింగ్​చేస్తున్నారు. ఇప్పటికే హెచ్​ఎండీఏ, సికింద్రాబాద్​ కంటోన్మెంట్​, ఎయిర్​పోర్ట్ ​అథారిటీ, డిఫెన్స్​ అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీ ఆయా ప్రాంతాల్లో పర్యటించింది. భూసేకరణపై ఓ నిర్ణయానికి వచ్చింది. ఎలివేటెడ్ కారిడార్​ నిర్మాణ పనులకు ఒక రూపం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల కోడ్​ ముగియగానే పనులు మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

అందులో భాగంగా ముందుగా ప్రైవేట్ ​భూముల సేకరణపై దృష్టి పెట్టారు. అయితే భూములు కోల్పోయే వారికి చెల్లించాల్సిన నష్టపరిహారంపై తర్జనభర్జన పడుతున్నారు. అవసరమైన నిధులు ఎలా సేకరించాలన్న దానిపై కసరత్తు చేస్తున్నారు. నష్టపరిహారం కంటే భూములు కోల్పోయే వారికి ట్రాన్సఫర్​ డెవలప్​మెంట్​ రైట్స్​(టీడీఆర్​) వర్తింపచేయాలని యోచిస్తున్నారు. టీడీఆర్​ అంటే భూములు కోల్పోయే వారు మిగిలిన స్థలంలో అవసరమైన మేర ఒకటి లేదా రెండు ఫ్లోర్లు నిర్మించుకునేందుకు అనుమతి ఉంటుంది.

అందుకు జీహెచ్​ఎంసీకి గానీ, హెచ్​ఎండీఏకు గానీ ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ విధానంతో హెచ్​ఎండీఏపై నష్టపరిహారం భారం పడకుండా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే కంటోన్మెంట్​పరిధిలో టీడీఆర్​ వర్తించదు. కాబట్టి ఇక్కడి భూ నిర్వాసితులకు తప్పని సరిగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఎన్నికల కోడ్​ ముగిశాక నష్టపరిహారం అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు హెచ్ఎండీఏ అధికారులు రెడీ అవుతున్నారు. 

మారనున్న రూపు రేఖలు

ఎలివేటెడ్​ కారిడార్​ నిర్మాణంతో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోనున్నాయి. ముఖ్యంగా రాజీవ్​ రహదారిలో ఎలాంటి ట్రాఫిక్​ ఇబ్బంది ఉండదు. వాహనాలు వేగంగా మూవ్​అయ్యే అవకాశం ఉంటుంది. ప్రాజెక్టులో భాగంగా సికింద్రాబాద్​ ప్యారడైజ్​ నుంచి బోయిన్​పల్లి డెయిరీ ఫామ్ ​రోడ్​ వరకు 5.32కి.మీ. మేరకు డబుల్​ డెక్కర్​ ఎలివేటెడ్​ కారిడార్​ నిర్మించనున్నారు. మొత్తం రూ.1,580 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. మొత్తం 74 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉంది. ఇందులో డిఫెన్స్​ ల్యాండ్​ 56 ఎకరాల వరకు, ప్రైవేట్​ భూములు 9 ఎకరాల వరకు ఉన్నాయి.

ఇక జేబీఎస్​ నుంచి హకీంపేట మీదుగా శామీర్​పేట ఓఆర్​ఆర్​ను కలిపే ఎలివేటెడ్ ​కారిడార్​ను రూ.2,232 కోట్లతో నిర్మిస్తున్నారు. 11.12 కి.మీ. మేరకు నిర్మించే ఈ ప్రాజెక్టుకు 197 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో 113 ఎకరాలు డిఫెన్స్​కు చెందిన భూములు కాగా, మరో 84 ఎకరాలు ప్రైవేట్​భూములను సేకరించాలని నిర్ణయించారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటివరకు  300 ప్రైవేట్​ నిర్మాణాలను గుర్తించారు. డబుల్ ​డెక్కర్​ కారిడార్​ కోసం 200పైగా నిర్మాణాలను గుర్తించారు. మిలిటరీ ఎస్టేట్​ భూములు, ​కంటోన్మెంట్​బోర్డుకు చెందిన భూములను ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ​సిగ్నల్​ ఇచ్చింది.