చతుర్విద జల ప్రక్రియతో ఏటా 3 పంటలు : మర్రి చెన్నారెడ్డి ట్రస్ట్​కార్యదర్శి మర్రిశశిధర్​రెడ్డి

చతుర్విద జల ప్రక్రియతో ఏటా 3 పంటలు : మర్రి చెన్నారెడ్డి ట్రస్ట్​కార్యదర్శి మర్రిశశిధర్​రెడ్డి

నారాయణపేట, వెలుగు : హనుమంతరావు చతుర్విద జల ప్రక్రియతో రైతులు ఏటా 3 పంటలు పండించుకోవచ్చని మర్రిచెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ కార్యదర్శి మర్రిశశిధర్​రెడ్డి అన్నారు. గురువారం ట్రస్ట్​ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్​మెంట్ సెంటర్​లో ఈ ప్రక్రియపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సదస్సుకు ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాజేందర్​రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు శివకుమార్​రెడ్డి ముఖ్య​అతిథులుగా హాజరయ్యారు. హనుమంత్​ చతుర్విద ప్రక్రియ రాజస్థాన్​లోని 33 జిల్లాలో మంచి ఫలితాలు ఇచ్చిందని, ఎడారి ప్రాంతంలో కూడా పంటలు పండిస్తున్నామని రాజస్థాన్ రివర్ బోర్డు అథారిటీ ఇంజినీర్​శుక్లా వివరించారు.

అనంతరం మర్రిశశిధర్​రెడ్డి మాట్లాడుతూ 2004లో మొదట సంగారెడ్డి జిల్లా గొట్టిగారిపల్లెలో ప్రయోగించామని, ఎంత కరువు వచ్చినా నేటికీ నీరు సమృద్ధిగా ఉందని తెలిపారు. ప్రభుత్వాలు ప్రాజెక్టులకు లక్షల కోట్లు ఖర్చు చేసే కన్నా ఈ ప్రక్రియను అమలు చేస్తే ప్రతిఒక్క రైతు మంచి పంటలు పండించుకొవచ్చన్నారు. నారాయణపేట జిల్లాలో ఎకరానికి రూ.15 వేల చొప్పున3 లక్షల ఎకరాల్లో ప్రక్రియ చేస్తే దాదాపు రూ.450 కోట్లు ఖర్చు అవుతుందని వివరించారు.

ఇది ప్రధాన లిఫ్ట్​ ప్రాజెక్టుకయ్యే ఖర్చుతో పోలిస్తే కేవలం 2శాతం మాత్రమేనన్నారు. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించాలని, రైతులకు అవగాహన కల్పించి జిల్లాలో చతుర్విద జల ప్రక్రియ అమలయ్యేవిధంగా ప్రభుత్వంతో చర్చించాలని సూచించారు. ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో రైతులు లాభపడే వాటర్​షెడ్​ కార్యక్రమాన్ని  గురించి కేంద్రంతో మాట్లాడుతామన్నారు.

ఎమ్మెల్యే పర్ణికారెడ్టి మాట్లాడుతూ ఈ విషయంపై మంత్రులతో చర్చిస్తామని  పేర్కొన్నారు. కార్యక్రమంలో పర్యావరణవేత్త పురుషోత్తంరెడ్డి, వాటర్​షెడ్​నిపుణులు అప్సర్, ఇస్రో ఇంజినీర్ సురేశ్, నాబార్డ్​అధికారి షణ్ముకాచారి, జిల్లా రైతు కన్వీనర్ సుదర్శన్​రెడ్డి, మార్కెట్​కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్​ పాల్గొన్నారు.