![సత్తుపల్లిలో బీజేపీ, కాంగ్రెస్ లీడర్ల మధ్య వాగ్వాదం](https://static.v6velugu.com/uploads/2025/02/massive-clash-breaks-out-between-bjp-and-congress-leaders-in-sathupalli_lgiXKz08nC.jpg)
సత్తుపల్లి, వెలుగు : రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్నారంటూ కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ నాయకులు సందీప్ గౌడ్, నండ్రు ప్రశాంత్ మరో ముగ్గురు యువకులతో కలిసి స్థానిక బీజేపీ కార్యాలయంపై దాడికి యత్నించారు. బీజేపీ మండల అధ్యక్షుడు పాలకొల్లు శ్రీనివాస్ పై దాడికి దిగడంతో అక్కడే ఉన్న బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. ఈ ఘటనను నిరసిస్తూ వేంసూర్ రోడ్ లోని బీజేపీ కార్యాలయం ఎదుట రహదారిపై ఆ పార్టీ నాయకులు రాస్తారోకో చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వర రావు మాట్లాడుతూ సత్తుపల్లి చరిత్రలో పార్టీ కార్యాలయాలపై, నాయకులపై దాడి చేసే సంస్కృతి లేదని, ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు కొత్త ఒరవడికి తెర లేపారని విమర్శించారు. ఈ విషయమై కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డితో పాటు, ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దాడికియత్నించిన యువకులను పోలీసులు స్టేషన్ కు తరలించారు.