
జోగిపేట, వెలుగు: సంగారెడ్డి జిల్లా జోగిపేట ఏరియా హాస్పిటల్ స్టోర్ రూమ్లో శనివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో అనూహ్యంగా మంటలు ఎగిసి పడడంతో స్టోర్ రూమ్ లో భద్రపరిచిన మెడిసిన్స్, సర్జికల్ ఎక్విప్మెంట్స్, ఇతర సామగ్రి దగ్ధమయ్యాయి. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వగా, ఫైర్ ఇంజన్ తో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.
మందులు కాలిపోవడంతో పరిసర ప్రాంతం పొగతో నిండిపోయింది. స్టోర్రూమ్ ఆసుపత్రికి కొంచెం దూరంలో ఉండడంతో రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఈ ప్రమాదంలో రూ.2 లక్షల విలువైన మెటీరియల్ దగ్ధమైనట్లు డీసీహెచ్వో సంగారెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సౌజన్య తెలిపారు. ఘటనా స్థలాన్ని జోగిపేట ఆర్డీవో పాండు పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.