
యాచారం: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గునుగల్లో దారుణం జరిగింది. పెద్దల సమక్షంలో మాట్లాడుతుండగా ఇరు వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. అవతలి వర్గం వారు ఇటుకతో వెంకటేష్ అనే హోం గార్డు ఛాతిపై దాడి చేశారు.
యాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తుండగా హోంగార్డ్ వెంకటేష్ కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. సాగర్ రోడ్డుపై బైఠాయించిన వెంకటేశ్ కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం ధర్నాకు దిగారు. దీంతో.. సాగర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సాగర్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలను దారి మళ్లించారు.
అసలు ఆ రోజు ఏం జరిగిందంటే..
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, బయటకు వచ్చిన కొద్దిసేపటికే హోంగార్డు వెంకటేశ్ మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్ గల్ గ్రామానికి చెందిన మేడిపల్లి వెంకటేశ్(36) రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అంబర్ పేట హెడ్ క్వార్టర్స్ లో హోమ్ గార్డుగా పని చేస్తున్నాడు. డ్రైనేజీ విషయంలో ఆదివారం ఉదయం తన ఇంటి పక్కన ఉన్న దాయాదులు మేడిపల్లి పవన్, ప్రశాంత్, యాదమ్మతో వాగ్వాదానికి దిగారు.
అనంతరం జరిగిన ఘర్షణలో ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత మధ్యాహ్నం యాచారం పీఎస్లో వెంకటేశ్ ఫిర్యాదు చేశాడు. అనంతరం బయటకు వచ్చి ఒక్కసారిగా కింద కుప్పకూలాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు బాధితుడిని సమీప హాస్పిటల్కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.