గ్రేటర్​ వరంగల్​లో అభివృద్దికి అడ్డంకులు

గ్రేటర్​ వరంగల్​లో అభివృద్దికి అడ్డంకులు
  •     ఇంకా 1971 నాటి ప్లానే అమలు చేస్తున్రు 
  •     సిటీలో ఎటుచూసినా అడ్డదిడ్డంగా నిర్మాణాలు
  •     రెండేళ్లుగా  సీఎం ఆఫీస్‍లో పడిఉన్న కొత్తప్లాన్​ 

వరంగల్‍, వెలుగు: వరంగల్​ సిటీని 2041 నాటి అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దేందుకు తయారు చేసిన ‘కుడా’ మాస్టర్​ప్లాన్​కుమున్సిపల్ మంత్రి కేటీఆర్​రెండేండ్ల కిందటే గ్రీన్‍సిగ్నల్‍ ఇచ్చినా.. సీఎంవో అప్రూవల్​ రాక అమలుకు నోచుకోవడంలేదు. 50 ఏండ్ల కిందట రూపొందించిన ప్లానే ఇప్పటికీ అమల్లో ఉంది. పెరుగుతున్న  సిటీ పరిధి,  జనాభాకు తగ్గట్టు 15, 20 ఏళ్లకోసారి మాస్టర్‍ ప్లాన్‍ ను రివైజ్​ చేయాల్సిఉన్నా సర్కారు పట్టించుకోలేదు. టీఆర్​ఎస్​ గవర్నమెంట్​ వచ్చినప్పటినుంచి కొత్త మాస్టర్‍ ప్లాన్‍ అమలు చేస్తామని చెప్తున్నారు. గత ఏడాది గ్రేటర్​ ఎన్నికల్లో భాగంగా ఇక్కడికి వచ్చిన కేటీఆర్..  వరంగల్ ను ఫ్యూచర్​ సిటీగా మారుస్తామని కూడా ప్రకటించారు. ఆ దిశగా అడుగు పడడం లేదు. 

సిటీ పరిధి బాగా పెరిగింది.. 

స్మార్ట్​సిటీల ఏర్పాటు మాస్టర్ ప్లాన్ అమలుతోనే సాధ్యమని, సరైన మాస్టర్ ప్లాన్ లేకుంటే నగరాలు డెవలప్‍ కావని నీతి అయోగ్ భావిస్తోంది. సరైన ప్లాన్లు తయారు చేసుకోవాలని బల్దియాలకు సూచించింది.  20 ఏండ్లపాటు అభివృద్ధికి తగ్గట్టు 1971లో రూపొందించిన మాస్టర్​ప్లాన్​ ను  కొంత సవరించి 1972 నుంచి అమలు చేస్తున్నారు. ఈ లెక్కన 1991లో కొత్త మాస్టర్​ప్లాన్​  తీసుకురావాల్సి ఉన్నా పట్టించుకోలేదు. 2013లోనే  కొత్త ప్లాన్‍ తయారుచేసినప్పటికీ వివిధ కారణాలతో పక్కన పెట్టేశారు. సిటీ పరిధి 60 చదరపు కిలోమీటర్లుగా ఉన్నప్పుడు ఈ ప్లాన్ రెడీ చేశారు. ఆ తర్వాత 181 గ్రామాలు గ్రేటర్​లో విలీనమయ్యాయి. దీంతో సిటీ పరిధి 1,801 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది.  స్మార్ట్ సిటీ, హృదయ్, అమృత్ స్కీమ్​లకు వరంగల్ సెలక్ట్​ కావడంతో మెరుగైన ప్లాన్​ తయారు చేయాలని భావించిన కుడా ఈ బాధ్యతను లీ అసోసియేట్స్ అనే ఇంటర్నేషనల్​సంస్థకు అప్పగించింది. వరంగల్​ సిటీలో రెసిడెన్షియల్​ , కమర్శియల్,  మిక్స్ డ్ యూజ్ జోన్, ఇండ్రస్ట్రీయల్ జోన్, గ్రోత్ కారిడార్​, అగ్రికల్చర్, హెరిటేజ్ కన్జర్వేషన్ తదితర జోన్లను అభివృద్ధి చేసేందుకు వీలుగా ప్లాన్​లో మార్పులు చేశారు. పార్కులు, గార్డెన్లు, గ్రీన్ బఫర్స్​ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్లాన్​అప్​గ్రేడ్​ చేశారు.

రెండేళ్లుగా..మూలకుపెట్టిన్రు

కేసీఆర్‍ రెండోసారి అధికారంలోకి వచ్చాక కుడా మాస్టర్‍ ప్లాన్‍ అమలు అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈ ప్లాన్​కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు, సిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలందరూ ఓకే చేసి.. ప్రభుత్వ ఆమోదం కోసం పంపారు. మున్సిపల్‍ శాఖ మంత్రి కేటీఆర్ ను కలిసి ప్లాన్​అప్రూవల్​ చేయాలని కోరారు.  చర్చల తర్వాత 2020 మార్చి 11న మంత్రి కేటీఆర్‍ మాస్టర్​ప్లాన్​ అమలుకు గ్రీన్‍సిగ్నల్‍ ఇచ్చి.. సీఎం ఆఫీస్‍ కు పంపారు. అయితే ఈ ప్లాన్​పై కేసీఆర్‍ అభ్యంతరాలు వ్యక్తం చేశారని, కొన్ని మార్పులు సూచించారని లోకల్ లీడర్లు చెప్పారు. దీంతో ప్లాన్​ అమలుకు నోచుకోవడంలేదు.  మాస్టర్ ప్లాన్ అమల్లోకి రాకపోవడంతో సిటీలో చెరువులు, కుంటలు, కబ్జాకు గురవుతున్నాయి. అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. డెవలప్​మెంట్​ వర్క్స్​కూడా అడ్డదిడ్డంగా చేపడుతున్నారు. ఇది వరద ముప్పనకు కారణమవుతోంది.